Begin typing your search above and press return to search.

వివేకా హత్యను కళ్లకు కట్టినట్లుగా నివేదికలో చెప్పిన సీబీఐ

By:  Tupaki Desk   |   22 Oct 2022 4:42 AM GMT
వివేకా హత్యను కళ్లకు కట్టినట్లుగా నివేదికలో చెప్పిన సీబీఐ
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారిన వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి.. అసలీ దారుణం ఎలా చోటు చేసుకుంది? ఎలా హత్య చేశారు? దీని వెనుక ఎవరున్నారు? హత్యకు సహకరించిన వారెవరు? హత్య వేళలో ఏం జరిగింది? హత్య చేసిన తర్వాతేమైంది? ఇలాంటి ఎన్నోప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇచ్చేలా సీబీఐ నివేదికలోని అంశాలు ఉన్నాయి. తాజాగా సుప్రీంకోర్టుకు సీబీఐ అందజేసిన నివేదికలో వివేకా హత్య గురించి వివరాలున్నాయి. అందులోని ముఖ్యాంశాల్ని చూస్తే..

- పులివెందులలోని గంగిరెడ్డి ఇంట్లో వివేకా హత్యకు కుట్ర జరిగింది.

- వివేకానందరెడ్డితో 35 ఏళ్లుగా సన్నిహిత పరిచయం ఉన్నకారణంతోనే గంగిరెడ్డి వివేకా ఇంట్లోకి ప్రవేశించగలిగాడు. అర్థరాత్రి వేళ వివేకాతో మాట్లాడుతున్న సమయంలోనే మిగిలిన నిందితులు వెనుక తలుపు నుంచి లోపలకు ప్రవేశించారు.

- వివేకాను చిత్రహింసలు పెట్టి.. డ్రైవర్ ప్రసాద్ తనపై దాడి చేసినట్లుగా తప్పుడు లేఖ రాయించారు. తమ గురించి ఎవరికైనా చెబితే చంపేస్తామని వాచ్ మన్ రంగన్నను గంగిరెడ్డి బెదిరించారు.

- హత్య జరిగిన తర్వాతి తెల్లవారుజామున 3.15 గంటల వేళలో ఉమాశంకర్ రెడ్డి.. వివేకా ఇంటి సమీపం నుంచి పరిగెత్తటం సీసీ కెమేరాల్లో రికార్డు అయ్యింది.

- వాచ్ మన్ రంగన్న వాంగ్మూలం ప్రకారం.. వివేకా అరుపుల్ని తాను విన్నానని.. గంగిరెడ్డి.. సునీల్ యాదవ్.. ఉమాశంకర్ రెడ్డి.. దస్తగిరిలు ఆ రోజు ఇంటికి వచ్చారు.

- హత్య చేసినందుకు రూ.40 కోట్లు ఇస్తామని శివశంకర్ రెడ్డి చెప్పారని దస్తగిరి వెల్లడించారు. శివశంకర్ రెడ్డి వైసీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అతడిపై 31 క్రిమినల్ కేసులు ఉన్నాయి. అతడి ప్రోద్బలం వల్లే వివేకా హత్యకు కుట్ర జరిగింది.

- ప్రలోభాలు.. బెదిరింపులకు పాల్పడ్డ అవినాశ్ రెడ్డి.. భాస్కర్ రెడ్డి హత్యకు బాధ్యత తీసుకుంటే రూ.10 కోట్లు ఇస్తామని గంగాధర్ రెడ్డికి చెప్పారు. తొలుత ఈ డీల్ కు ఓకే చెప్పిన గంగాధర్ రెడ్డి.. ఆ తర్వాత వెనక్కి తగ్గారు. సీబీఐ ఒత్తిడి తెస్తుందని ఆరోపణలు చేశారు. అనూహ్యంగా 2022 జూన్ లో ఆయన తన ఇంట్లోనే అనుమానాస్పద రీతిలో మరణించారు.

- వివేకా హత్య తర్వాత అక్కడకు వెళ్లిన ఆయన స్టెనో షేక్ ఇనయతుల్లా సమర్పించిన ఫోటోలు చూస్తే అది హత్యేనని స్పష్టంగా అర్థమవుతుంది. కానీ.. నిందితులైన శివశంకర్ రెడ్డి.. గంగిరెడ్డి.. ఎర్ర గంగిరెడ్డితో పాటు వైఎస్ అవినాశ్ రెడ్డి.. వారి సన్నిహిత అనుచరులంతా వివేకా రక్తం కక్కుకొని గుండెపోటుతో మరణించారని నమ్మించేందుకు ప్రయత్నించారు.

- హత్య జరిగిన తర్వాతి రోజు ఉదయం 6.29 గంటల వేళలో వివేకా ఇంటికి వచ్చారు అవినాశ్ రెడ్డి.. శివశంకర్ రెడ్డి.. ఈసీ సురేంద్రరెడ్డి.. ఉదయ్ కుమార్ రెడ్డిలు.

- వివేకా రక్తపు మడుగులో ఉండటాన్ని.. బెడ్రూం మొత్తం రక్తసిక్తం కావటాన్ని చూసి కూడా శివశంకర్ రెడ్డి మాత్రం వివేకా గుండెపోటుతో మరణించినట్లుగా సాక్షి టీవీకి చెప్పారు.

- సీఐ శంకరయ్యను శివశంకర్ రెడ్డి.. అవినాశ్ రెడ్డిలు ఫోన్ చేసి పిలిపించారు. వివేకా ఒంటి మీద గాయాల గురించి మాట్లాడొద్దని వార్నింగ్ ఇచ్చారు.

- అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి.. ఇతరులు బెడ్రూంలోకి వెళ్లి తలుపులకు గడియ వేసి.. నెత్తుటి బెడ్ షీట్ ను గంగిరెడ్డి మార్చారు. ఆ తర్వాత బెడ్రూంను.. బాత్రూంను శుభ్రం చేసి సాక్ష్యాలు ధ్వంసం చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.