Begin typing your search above and press return to search.

బాబుకి విష్ణు చక్రం తగిలింది

By:  Tupaki Desk   |   9 March 2016 1:25 PM GMT
బాబుకి విష్ణు చక్రం తగిలింది
X
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంగళవారం అధికార పక్షానికి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. మిత్ర పక్షమైన బీజీపీకి చెందిన ఎమ్మెల్యే అధికార పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టారు. ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి లేవనెత్తిన ఓ అంశానికి మద్దతుగా నిలుస్తూ.. జగన్ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటూ భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు నిలదీయడంతో అధికార పక్షం ఇబ్బంది పడింది. ముందు జగన్ మాట్లాడుతూ.. పోలవరం పనులు అనుకున్న ప్రకారం జరగడం లేదని తెలిసినా కాంట్రాక్టరు ధరలు పెంచుకునేందుకు క్యాబినెట్ ఎలా అనుమతి ఇచ్చిందని ప్రశ్నించారు. క్యాబినెట్ తీర్మానంపై సంతకం పెట్టేందుకు కూడా సీఎస్ కూడా భయపడ్డారన్నారు. చంద్రబాబు బినామీ శీనయ్యకు పోలవరం పనుల్లో సబ్ కాంట్రాక్టు ఇచ్చారని.. రూ.23 కోట్ల పనికి రూ.74 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించారు.

దీనిపై నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని సమాధానం చెప్పాక.. భాజపా సభ్యుడు విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ.. మంత్రి వ్యాఖ్యల్లో స్పష్టత లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు కచ్చితంగా పూర్తవుతుందంటూనే.. జగన్ చెప్పిన దాంట్లో ఓ పాయింటు ఉందన్నారు. పనులు సరిగా చేయని కాంట్రాక్టరును ఎందుకు పొడిగించారో చెప్పాలన్నారు. ప్రభుత్వం ఎందుకు పొడిగించిందో తెలియదని అన్నారు. శీనయ్యకు రూ.23 కోట్లకు బదులు రూ.74 కోట్లు ఎందుకు ఇస్తున్నారని జగన్ అడుగుతున్నారని.. దీనిపై మంత్రి సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మిత్రపక్షానికి చెందిన ఎమ్మెల్యే ఇలా నిలదీయడంతో అధికార పార్టీ ఇబ్బందుల్లో పడింది. దీంతో మంత్రి దేవినేని మరోసారి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తర్వాత చంద్రబాబు కూడా విష్ణు వ్యాఖ్యలపై సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. పోలవరం ప్రాజెక్టు 2018లోపు పూర్తి చేసి తీరుతామని.. అవసరమైతే కేంద్రానికి పూర్తిగా ఈ ప్రాజెక్టు అప్పగించేసి.. తమ పాత్ర ఏమీ లేకుండా చూసుకోవడానికి సిద్ధమని చంద్రబాబు అన్నారు.