Begin typing your search above and press return to search.

టీడీపీపై హత్యారోపణలు చేసిన బీజేపీ నేత

By:  Tupaki Desk   |   26 March 2016 10:18 AM GMT
టీడీపీపై హత్యారోపణలు చేసిన బీజేపీ నేత
X
మిత్రపక్షం టీడీపీని ఎప్పుడు సమర్ధిస్తారో, ఎప్పుడు ఇరుకునపెడతారో ఆయనకే తెలియని నేత బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. తాజాగా ఆయన విశాఖలో నేరాలపై మాట్లాడుతూ ప్రభుత్వాన్ని నేరుగా టార్గెట్ చేశారు. తనకు భద్రత పెంచమన్నా పెంచడం లేదని ఆరోపించారు. అంతేకాదు.... తాను ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ నార్త్ నియోజకవర్గంలో శాంతిభద్రతలు దారుణంగా ఉన్నాయని ఆయన విమర్శించారు. తన నియోజకవర్గంలో రౌడీలు - కిరాయి హంతకులు రెచ్చిపోతున్నారని చెప్పారు. రెండు లక్షలు ఇస్తే ఎవరినైనా చంపేసేవారు ఉన్నారన్నారు. అలాంటి ప్రాంతంలో తాను నిత్యం పర్యటించాల్సి వస్తుంది కాబట్టి ప్రభుత్వం తనకు అదనపు భద్రత కల్పించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన రెండేళ్ల కిందటి ఓ సంఘటనను చెప్పారు.

2014లో గురుపౌర్ణమి రోజున తాను ఒక టీడీపీ నేత ఆహ్వానం మేరకు ఓ ఫంక్షన్ కు వెళ్లానని... తనకు, ఆయనకు ప్రాణహాని ఉందని ఆ టీడీపీ నేత అప్పుడు తనకు చెప్పారని అన్నారు. తాను అప్పటికి ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని.. కానీ, అదే రోజు సాయంత్రం ఆ టీడీపీ నేత హత్యకు గురయ్యారంటూ చెప్పారు. అంతేకాదు, ఆ హత్య చేయించింది కూడా మరో టీడీపీ నేత అని సంచలన ఆరోపణ చేశారు. నిందితులు ఎవరో తెలిసినా ఇంతవరకు దర్యాప్తు చేయడం లేదని ఆరోపించారు. హతుడి కుటుంబసభ్యులు 20 నెలలుగా మంత్రులు చుట్టూ తిరుగుతున్నారని.. అయినా దీనిపై విచారణ చేయలేదని ఆరోపించారు. వెంటనే ఆ హత్యపై సీఐడీ విచారణ జరపాలని పట్టుపట్టారు. తనకు కూడా భద్రత పెంచాలని కోరారు.