Begin typing your search above and press return to search.

ప‌చ్చ‌చొక్కా వేసుకొచ్చి దుమ్ముదులిపిన విష్ణు

By:  Tupaki Desk   |   14 March 2016 7:56 AM GMT
ప‌చ్చ‌చొక్కా వేసుకొచ్చి దుమ్ముదులిపిన విష్ణు
X
ఏపీ అసెంబ్లీలో సంచ‌ల‌నం చోటు చేసుకుంది. ఏపీ స‌ర్కారులో భాగ‌స్వామ్యంగా.. మిత్ర‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్న బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష నేత విష్ణుకుమార్ రాజు సోమ‌వారం స‌భ‌లో సంచ‌ల‌నం సృష్టించారు. ప‌సుపు చొక్కా వేసుకొచ్చిన ఆయ‌న‌.. తాను ప‌సుపు చొక్కా వేసుకొచ్చిన విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ.. ఏపీ స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌టం హాట్‌టాపిక్ గా మారింది.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు స‌భ‌లో ఉంటార‌ని భావించాన‌ని.. కానీ ఆయ‌న లేర‌న్న విష్ణుకుమార్‌రాజు.. శ్రీకాకుళం జిల్లాలో బీచ్‌శాండ్ పేరుతో అతి పెద్ద కుంభ‌కోణం జ‌రుగుతుంద‌ని మండిప‌డ్డారు. ఈ కుంభ‌కోణం గురించి తెలుసుకున్న త‌న‌కు బుర్ర తిరిగిపోయింద‌ని.. ఇది 2జీ స్కాం కంటే పెద్ద‌ద‌ని.. చాలా పెద్ద స్థాయిలో జ‌రుగుతుంద‌న్నారు.

పెద్ద‌మ‌నుషుల‌కు ఈ కుంభ‌కోణంతో సంబంధం ఉంద‌ని ఆరోపించిన ఆయ‌న‌.. రూ.1300కోట్ల విలువైన ఖ‌నిజం అక్ర‌మంగా ర‌వాణా అవుతున్నా ప్ర‌భుత్వ దృష్టికి రాక‌పోవ‌టం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు. ఏపీ అసెంబ్లీలో ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో ఈ కుంభ‌కోణాన్ని ప్ర‌స్తావించిన ఆయ‌న‌.. నిండు స‌భ‌లో అధికార‌ప‌క్షాన్ని దుమ్ము దుల‌ప‌టం గ‌మ‌నార్హం.
2006 నుంచి జ‌రుగుతున్న ఈ అక్ర‌మ వ్య‌వ‌హారంపై తాను దృష్టి పెట్టి వివ‌రాల‌న్నీ సేక‌రిస్తే.. ఈ భాగోతం భారీగా ఉంద‌న్నారు. మొత్తం 93 కంపెనీల ద్వారా 40 దేశాల‌కు రూ.1300 కోట్ల విలువైన ఖ‌నిజాన్ని ఎగుమ‌తి చేసిన‌ట్లుగా విష్ణుకుమార్ రాజు చెప్పారు. ఎన్‌వోసీ లేని చోట కూడా బీచ్ శాండ్ ను ఇష్టారాజ్యంగా త‌వ్వేశార‌ని మండిప‌డ్డారు. వేల కోట్ల రూపాయిల విలువైన ఖ‌నిజం ఎగుమ‌తి అవుతున్నా.. ప్ర‌భుత్వానికి మాత్రం మాత్రం ముష్టి 2 శాతం మాత్ర‌మేన‌ని అన్నారు. దుర‌దృష్ట‌వ‌శాత్తు తానింత ముఖ్య‌మైన విష‌యం మాట్లాడుతున్న స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స‌భ‌లో లేర‌ని.. ఖ‌నిజాల విష‌యంలో సంస్క‌ర‌ణ‌లు తీసుకురాక‌పోతే క‌ష్ట‌మ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. మిత్ర‌ప‌క్షంగా ఉంటూ.. భారీ కుంభ‌కోణం అంటూ హ‌డావుడి చేస్తున్న విష్ణుకుమార్‌రాజు.. ఇదే విష‌యాన్ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావిస్తే.. ఎఫెక్ట్ మ‌రింత త్వ‌ర‌గా ఉండేది క‌దా? మిత్రుడిగా ఉంటూ విష్ణు ఇంత హ‌డావుడి ఎందుకు చేస్తున్న‌ట్లు..?