Begin typing your search above and press return to search.

సింహాచలం పంచగ్రామాలకు మంచి మాట లేదా...?

By:  Tupaki Desk   |   30 April 2022 1:30 AM GMT
సింహాచలం పంచగ్రామాలకు మంచి మాట లేదా...?
X
ఉత్తరాంధ్రాలో సుప్రసిద్ధ పుణ్య క్షేత్రం శ్రీ సింహాచలం వరాహ లక్ష్మీ నరసిం హస్వామి వారి ఆలయం. ఈ ఆలయ భూములకు సంబంధించి పంచ గ్రామాలలో వివాదం నెలకొని ఉంది. ఈ భూమి దేవస్థానానికి చెందినది అని అక్కడ ఎలాంటి క్రయ విక్రయాలకు ఆస్కారం లేదని పేర్కొంటూ ధార్మిక వేత్తలు కోర్టులో కేసులు వేశారు. దేవస్థానానికి ఈ భూములు చెందాలన్నది వారి వాదన. అదే సమయంలో మధ్యే మార్గంగా ఈ భూములలో నివాసాలు కట్టడాలు ఏర్పాటు చేసుకున్న వారికి వెసులుబాటుని కల్పిస్తూ వారి నుంచి న్యాయమైన ధరని నిర్ణయించి వసూల్ చేయాలన్నది ఒక వాదన.

అయితే ఈ కేసు దాదాపుగా రెండు దశాబ్దాలుగా నలుగుతోంది. ప్రభుత్వాలు వస్తున్నాయి. మారుతున్నాయి. ఉమ్మడి ఏపీ సీఎం గా విభజన ఏపీ సీఎం గా చంద్రబాబు ఉన్నా సమస్య అలాగే ఉంది. ఇక వైఎస్సార్ తో పాటు ఆయన తనయుడు జగన్ సీఎం అయినా కూడా అడుగు ముందుకు కదలడంలేదు. ఈ నేపధ్యంలో వైసీపీ వస్తే ఈ సమస్య పరిష్కారం చేస్తామని జగన్ నాడు పాదయాత్ర వేళ చెప్పుకొచ్చారు. మూడేళ్ళు గడచిపోయాయి.

అయినా అలాగే ఉంది. తాజాగా విశాఖ జిల్లా పర్యటనకు వచ్చిన జగన్ కోర్టుల్లో ఉన్న ఈ కేసు విషయంలో తాను ఎక్కువగా మాట్లాడలేనని చెప్పి పంచగ్రామాల ప్రజలను ఉసూరుమనిపించారు. ఈ విషయంలో తొందరగా న్యాయం జరిగేలా చూస్తామని జగన్ చెప్పేసి వెళ్లిపోయారు. దాంతో పంచగ్రామాల వాసులు మండిపడుతున్నారు.

గత ప్రభుత్వాలు చేయలేని పని తాము చేసి చూపెడతామని వైసీపీ నేతలు చెప్పారని, మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పిన ముఖ్యమంత్రి ఇపుడు ఇలా చేతులెత్తేయడమేంటి అని ఫైర్ అవుతున్నారు. కోర్టులలో ఈ కేసు ఉందన్నది తెలుసని, అవుటాఫ్ ది కోర్టుగా దానికి ప్రభుత్వం తరఫున తగిన పరిష్కారం కనుక్కొని న్యాయం చేయాల్సిన వైసీపీ పెద్దలు అంతా తమ చేతుల్లో లేదని చెప్పడం దారుణం అంటున్నారు.

మూడు తరాలు రెండున్నర దశాబ్దాలు పంచ గ్రామాల ప్రజలు బాధపడుతున్నారని అంటున్నారు. ఎపుడో కట్టుకున్న ఇళ్ళు పాడైపోయాయి. వాటిని బాగు చేసుకోవడానికి అసలు వీలు లేదు, అలాగే క్రయ విక్రయాలకు ఆస్కారం లేదు, ఈ వివాదం ఎపుడు తెములుతుందో తెలియదు అని వాపోతున్నారు. మొత్తానికి పంచగ్రామాల ప్రజలు మంచి మెజారిటీతో వైసీపీని గెలిపించారు. ఇపుడు తమ సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో మండుతున్నారు. జగన్ హామీ ఏమైందని కూడా నిలదీస్తున్నారు.