Begin typing your search above and press return to search.

విశాఖ పట్నమా? 'నిషా' ఖపట్నమా?

By:  Tupaki Desk   |   6 Nov 2016 6:29 AM GMT
విశాఖ పట్నమా? నిషా ఖపట్నమా?
X
ఏపీలో మద్యం వ్యాపారం మూడు పువ్వులు - ఆరు కాయలుగా విస్తరిస్తోంది. వీధికో దుకాణం.. రోడ్డురోడ్డునా బార్ అన్నట్లుగా ఎక్కడికక్కడ మద్యం విక్రయాలు ఉండడంతో జనం తాగుడుకు బానిసవుతున్నారు. గత ఏడు నెలల్లో ఏపీలో ఏకంగా 11.65 శాతం మద్యం అమ్మకాలు పెరిగాయి. మద్యం అమ్మకాల్లో విశాఖపట్టణం దూసుకుపోయింది. ఏడునెలల్లో జరిగిన మద్యం విక్రయాల్లో విశాఖ అగ్రస్థానంలో నిలిచింది. గతేడాది ఈ విషయంలో తూర్పుగోదావరి జిల్లా ఆగ్రస్థానంలో నిలవగా ఈసారి ఆ స్థానాన్ని వైజాగ్ దక్కించుకుంది. ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు జరిగిన అమ్మకాల్లో విశాఖ జిల్లా రూ.929 కోట్లతో టాప్ ప్లేస్‌ లో నిలిచింది. ఆ తర్వాతి స్థానాన్ని రూ.875 కోట్లతో తూర్పు గోదావరి జిల్లా కైవసం చేసుకుంది.

ఇక కృష్ణా - గుంటూరు జిల్లాలు కూడా మద్యం అమ్మకాల్లో దూసుకుపోయాయి. రూ.850 కోట్లతో ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. రాజధాని ప్రాంతంలోనూ మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి.

విజయవాడ - మంగళగిరి - గుంటూరు నగరాలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తుండడంతో మద్యం అమ్మకాలు పెరిగాయి. ఇక మద్యం విక్రయాల విషయంలో ఎప్పటి లాగే ఉత్తరాంధ్ర జిల్లా అయిన శ్రీకాకుళం - రాయలసీమ జిల్లాలు చివరి స్థానాల్లో నిలిచాయి. కడపలో రూ.408 కోట్లు - శ్రీకాకుళంలో రూ.413 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. విశాఖ - విజయవాడల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరుగుతుండడం.. కొత్త సంస్థలు - వ్యాపారాలు మొదలవుతుండడం.. డబ్బు లావాదేవీలు - పార్టీలు పెరగడంతో విక్రయాలు విపరీతమయ్యాయి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/