Begin typing your search above and press return to search.

స్వయం ప్రతిపత్తి తొలగింది... కశ్మీరమంతా మువ్వన్నెల జెండాలే

By:  Tupaki Desk   |   9 Aug 2019 6:24 PM GMT
స్వయం ప్రతిపత్తి తొలగింది... కశ్మీరమంతా మువ్వన్నెల జెండాలే
X
జమ్మూ కశ్మీర్ లో ఈ పంద్రాగస్టు నాడు ప్రత్యేక పరిస్థితులు కనిపించనున్నాయి. ఇప్పటిదాకా అక్కడ పంద్రాగస్టు నాడు అక్కడి స్థానిక జెండాలు ఎగిరితే... ఈ పంద్రాగస్టున మాత్రం భారత జాతీయ జెండా త్రివర్ణ పతాకం రెపరెపలాడనుంది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి కశ్మీర్ లోని గ్రామ పంచాయతీల పెద్దలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కశ్మీర్ కు స్వయంప్రతిపత్తిని తొలగించినందున ఇకపై పంద్రాగస్టున జాతీయ జెండాలనే ఎగురవేయాలని అక్కడి పంచాయతీ పెద్దలకు కిషన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

కశ్మీర్ కు స్వయంప్రతిపత్తిని రద్దు చేస్తూ పార్లమెంటు చట్టం చేస్తే... ఇప్పుడు కశ్మీర్ లో గ్రౌండ్ లెవల్లో స్పష్టమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ మార్పులు ఈ పంద్రాగస్టుతోనే మొదలు కానుండటం గమనార్హం. కశ్మీర్ కు స్వాతంత్య్రం నాటి నుంచి కూడా స్వయంప్రతిపత్తి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ స్వయంప్రతిపత్తి కారణంగా పంద్రాగస్టున కశ్మీర్ వ్యాప్తంగా జాతీయ జెండాలు కాకుండా అక్కడి స్థానిక ప్రభుత్వం రూపొందించిన జెండాలు ఎగిరేవి. దేశ భూభాగంలో కశ్మీర్ ఓ భాగమే అయినా కూడా ఆ రాష్ట్రానికి కొనసాగుతున్న స్వయంప్రతిపత్తి కారణంగా ప్రత్యేక పరిస్థితులు కనిపించాయి.

అయితే నరేంద్ర మోదీ సర్కారు అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని కశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దు చేస్తూ కశ్మీర్ ను రెండు ముక్కలు చేసి... ఆ రెండు ముక్కలకు కూడా రాష్ట్ర హోదాను తీసేసి కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చేసింది. ఈ నిర్ణయంపై కశ్మీర్ కు చెందిన ప్రాంతీయ పార్టీలు తీవ్రంగా విరుచుకుపడినా కూడా మోదీ సర్కారు వెనుదిరగలేదు. ఫలితంగా పార్లమెంటులో కశ్మీర్ విభజన బిల్లుకు ఆమోదం లభించేసింది. ఆ తర్వాత కశ్మీర్ లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న కేంద్రం... పంద్రాగస్టు సమీపిస్తున్న తరుణంలో మార్పులకు శ్రీకారం చుట్టింది.

ఈ మార్పుల ప్రక్రియను కిషన్ రెడ్డితో మొదలుపెట్టింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాలతో రంగంలోకి దిగిన కిషన్ రెడ్డి... ఈ పంద్రాగస్టు నాడు కశ్మీర్ వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లోనూ త్రివర్ణ పతాకాలే ఎగురవేయాలని, ఈ విషయాన్ని గ్రామ పెద్దలు ప్రాధాన్యతాంశంగా పరిగణించాలని సూచిస్తూ ఓ కీలక ప్రకటనను జారీ చేశారు. ఈ ప్రకటనకు అనుగుణంగా పంద్రాగస్టున కశ్మీర్ వ్యాప్తంగా జాతీయ జెండాలు రెపరెపలాడనున్నాయి.