Begin typing your search above and press return to search.

నైజీరియన్ మోసగాళ్లను తలపిస్తున్న రవిప్రకాష్

By:  Tupaki Desk   |   17 May 2019 10:50 AM GMT
నైజీరియన్ మోసగాళ్లను తలపిస్తున్న రవిప్రకాష్
X
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుతోపాటు టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ పై నిప్పులు కురిపించారు. టీవీ9 లోగోలను రవిప్రకాష్ మెజార్టీ షేర్ హోల్డర్లకు తెలియకుండా కేవలం 99వేలకే అమ్ముకున్నారన్న వార్తల పై ట్విట్టర్ లో కడిగిపారేశారు. దేశంలో తాజ్ మహల్ నే అమ్మిన ఘనులున్నారని.. ఇలా టీవీ9లో రొజుకొకటి చొప్పున వెలుగుచూస్తున్నవి మెరుగైన సమాజం కోసం చేసిన మోసాలుగా కనిపిస్తున్నాయని.. నైజీరియన్ మోసగాళ్లను తలపిస్తున్నాయని విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. మీడియా ‘నయీం’ నేరాలపై దర్యాప్తు అధికారులు పక్కా ఆధారాలు సేకరించారని.. ఆయనకు సహకరించి నాటకాలు ఆడుతున్న గరుడపురాణం శివాజీ కూడా ఈ కేసు నుంచి తప్పించుకోలేడని పేర్కొన్నారు. వీరిద్దరూ చట్టాలను ఎంత చులకన చేశారో అర్థమవుతోందన్నారు.

బెంగాల్ లో తృణమూల్ కు మద్దతుగా ఓ అధికారి ఆ పార్టీ బటన్ నొక్కిందని.. ఎన్నికల కమిషన్ ఏపీలోనూ మెత్తగా వ్యవహరించి ఉంటే అదే తరహాలో బాబు కూడా రిగ్గింగ్ చేసేవాడని విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. చంద్రగిరిలో దళితులను బెదిరించి టీడీపీ రిగ్గింగును చేసినందుకే మళ్లీ రీపోలింగ్ నిర్వహించారని విజయసాయిరెడ్డి తెలిపారు. రీపోలింగ్ అన్యాయమంటూ ఢిల్లీలో చంద్రబాబు రాద్ధాంతం చేస్తున్నాడని విమర్శించారు.

టీడీపీ పతనం ఖాయమని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకొని ఇవాళ భ్రష్టు పట్టించిన చంద్రబాబుకు ప్రజలు మే 23న తగిన గుణపాఠం చెబుతున్నారని పేర్కొన్నారు. టీడీపీని నాశనం చేసినందుకు చంద్రబాబు పై తిరుగుబాటు ఖాయమని .. ఈనెల 23 తర్వాత టీడీపీ ముక్కులవుతుందని అన్నారు.

మే 23 తర్వాత టీడీపీ పార్టీ కనుమరుగు సహా ఎన్నో వింతలు విడ్డూరాలు చోటుచేసుకోబోతున్నాయని దీన్ని అందరూ చూస్తారని విజయసాయిరెడ్డి ట్వీట్లతో చంద్రబాబును ఎండగట్టారు.. అందుకే చంద్రబాబు ఈ పరిణామాన్ని ముందుగానే ఊహించి పరువు కాపాడుకోవడం కోసం మహానాడును రద్దు చేసుకున్నాడని.. దీన్ని బట్టి టీడీపీ ఓటమి ఖాయమని ముందే తేటతెల్లమైందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.