Begin typing your search above and press return to search.

విజ‌య‌వాడ మెట్రోః ఇదేం ట్విస్ట్?

By:  Tupaki Desk   |   14 Nov 2015 9:06 AM GMT
విజ‌య‌వాడ మెట్రోః ఇదేం ట్విస్ట్?
X
రాష్ట్ర రాజధాని అమరావతి నగర నిర్మాణంతో విజయవాడ నగర రూపురేఖలు మార్చేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మెట్రో రైలు ప్రాజెక్టును వాస్తవానికి 2018 డిసెంబర్ లోగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ఆదేశించారు. అయితే 2017 డిసెంబర్ నాటికి ఈ ప్రాజెక్టును పూర్తిచేయటానికి సమన్వయ క‌మిటీ ఏర్ప‌డింది. తాజాగా తొలిసారి సమావేశం అయితే క‌మిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో కలెక్టర్ అహ్మ‌ద్‌ బాబు - పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ - రైల్వే డిజిఎం అశోక్‌ కుమార్ - సబ్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి - ఇలా అన్ని ముఖ్య‌శాఖల అధికారులు పాల్గొని మెట్రోను త్వ‌ర‌గా పూర్తిచేసేందుకు చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల గురించి చ‌ర్చించారు.

రెండు కారిడార్లుగా రూపొందించే మెట్రై రైల్‌ కార్యాచరణలో మొత్తం 24 స్టేషన్లు - కనీస వేగంగా గంటకు 33కిమీ - గరిష్టంగా 80కిమీ ఉండే విధంగా లైన్ల నిర్మాణాన్ని ప్రతిపాదించారు. 26కిలోమీట‌ర్ల‌ మేర రెండు కారిడార్లలో నిర్మించబోయే ఈ ప్రాజెక్టుకు రూ.6,823కోట్లు ఖర్చు కాగలదని అంచనా వేశారు. మొదటి కారిడార్‌ లో పెనమలూరు నుంచి బందరు రోడ్డు మీదుగా బస్టాండ్‌ కు - రెండో కారిడార్‌ లో నిడమానూరు - ప్రసాదంపాడు - రామవరప్పాడు - గుణదల - ఏలూరు రోడ్డు - అలంకార్ ధియేటర్ - రైల్వేస్టేషన్ - తుమ్మలపల్లి కళాక్షేత్రం - పోలీస్ కంట్రోలు రూమ్ - ఫైర్‌ స్టేషన్ మీదుగా బస్టాండ్‌ కు కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. బెంజిసర్కిల్ వద్ద ప్రతిపాదించిన ఫ్లైఓవర్ పై నుంచే మెట్రో రైలు వెళ్లనుంది. ఇక్కడ సుమారు 18మీటర్ల ఎత్తు ఉండేలా డిజైన్ రూపొందించారు. ప్రాజెక్టుకు సంబంధించి వివిధ శాఖల నుంచి రావాల్సిన అన్ని రకాల అనుమతులను కచ్చితంగా పదిరోజుల్లోగా వచ్చేలా ఆయా శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని నిర్ణయించడం మెట్రోను త్వ‌ర‌గా పూర్తిచేసేందు ప్ర‌భుత్వం చూపిస్తున్న ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌కు నిద‌ర్శ‌నంగా చెప్తున్నారు.