Begin typing your search above and press return to search.

బెజవాడ గ్యాంగ్ వార్: నగర బహిష్కరణ

By:  Tupaki Desk   |   9 Jun 2020 3:30 PM GMT
బెజవాడ గ్యాంగ్ వార్: నగర బహిష్కరణ
X
విజయవాడలో గ్యాంగ్‌ వార్ ఘటన ఒక్కసారిగా అందరిని ఉలిక్కిపడేలా చేసింది. గత కొన్ని రోజులుగా ప్రశాంతంగా ఉన్న విజయవాడలో ఈ గ్యాంగ్ వార్ మళ్లీ అలజడి సృష్టించింది. అయితే , ఈ గ్యాంగ్ వార్ పై తీవ్రంగా స్పందించిన పోలీసు కమిషనర్‌ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు ఇరు గ్రూపులకు చెందిన సభ్యులపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ గ్యాంగ్ ‌వార్‌ లో పాల్గొన్న కొందరు యువకులపై నగర బహిష్కరణ వేటు వేయాలని నిర్ణయించారు. అలాగే నిందితులందరిపైనా పీడీ యాక్ట్‌ ను ఉపయోగించబోతున్నారు.

ఈ ఘర్షణ జరిగిన రోజు నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన 10 మంది నిందితుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అజ్ఞాతంలో ఉన్నవారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నట్లు తెలిసింది. అలాగే కన్నబిడ్డను నేరాల వైపు ప్రోత్సహించిన కారణంగా పండు తల్లి కోడూరి పద్మావతిపై పటమట పోలీసులు కేసు నమోదు చేసి రౌడీ షీట్‌ ఓపెన్‌ చేశారు. గతంలో పద్మావతిపై పెనమలూరు పరిధిలో రెండు కేసులు ఉన్నాయి. ఇప్పుడు పటమట 307 ఐపీసీ సెక్షన్‌ కింద కేసు నమోదు అయింది. మొత్తం మూడు కేసులు నమోదు కావడంతో ఈమెపై రౌడీషీట్‌ ఓపెన్‌ చేయనున్నారు. దీంతో పెనమలూరు పోలీసుస్టేషన్‌ పరిధిలోనే కాకుండా నగరంలోనే మొట్టమొదటి మహిళ రౌడీషీటర్‌ గా ఈమె పోలీసు రికార్డుల్లోకెక్కనుంది.

మాజీ రౌడీషీటర్‌ తోట సందీప్‌ గ్యాంగ్‌ సభ్యులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ ‌కు తరలించారు. పదకొండు రోజుల కిందట విజయవాడలోని పటమట తోటవారివీధిని మైదానంలో రెండు గ్రూపులు మారణాయుధాలతో దాడి చేసుకున్న సంగతి విదితమే. ఈ గ్యాంగ్ ‌వార్‌ లో తీవ్రంగా గాయపడ్డ తోట సందీప్‌ మృతి చెందగా.. మరో గ్రూపునకు లీడర్‌ గా ఉన్న కోడూరి మణికంఠ అలియాస్‌ పండు గాయాలతో గుంటూరు జీజీహెచ్ ‌లో చికిత్స పొందుతున్నాడు. పండు వర్గంపై దాడికి పాల్పడ్డ తోట సందీప్‌ వర్గానికి చెందిన 11 మందిని పటమట పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ మేరకు కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ హర్షవర్థన్‌రాజు ఆ వివరాలను వెల్లడించారు. వీరిలో చాలా మంది సందీప్‌కు చిన్ననాటి స్నేహితులు కావడం, ఒకే స్కూల్‌ లో చదువుకోవడం వల్ల ఆ పరిచయంతో పిలవగానే వీరంతా సందీప్‌ వెంట వచ్చారని చెప్పారు. ఈ ఘటనకు సంబంధం ఉన్నవారందరిపైనా వేట కొనసాగుతోందన్నారు.