Begin typing your search above and press return to search.

ఎంపీ ర‌ఘురామ అడ్డంగా బుక్క‌యిన‌ట్టేనా? సాయిరెడ్డి ఆధారాలు ఇవే!

By:  Tupaki Desk   |   27 July 2021 9:30 AM GMT
ఎంపీ ర‌ఘురామ అడ్డంగా బుక్క‌యిన‌ట్టేనా?  సాయిరెడ్డి ఆధారాలు ఇవే!
X
ఏపీ స‌ర్కారుపై నిరంతర విరామం లేకుండా.. విమ‌ర్శ‌లు చేస్తూ.. త‌న‌కు టికెట్ ఇచ్చిన పార్టీపైనే క‌త్తిక‌ట్టి న వైసీపీ ఎంపీ.. ర‌ఘురామ‌రాజుకు గ‌ట్టి షాకే ఇచ్చారు ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు.. విజ‌య‌సాయిరెడ్డి. ఏపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శలు చేయ‌డంతోపాటు.. ప్ర‌భుత్వంపై కుట్ర ప‌న్నేలా.. ఓ మీడియా అధినేత‌తో ర‌ఘురామ చేతులు క‌లిపార‌ని.. ఈ క్ర‌మంలో కోట్ల రూపాయ‌లు ర‌ఘురామ అకౌంట్ చేరుకున్నాయ‌ని.. కొన్నాళ్లుగా సాయిరెడ్డి ఆరోపిస్తున్న విష‌యం తెలిసిందే.

ఈ క్ర‌మంలో ఇటీవ‌ల ప్ర‌ధాని మోడీ.. రాష్ట్ర‌ప‌తిల‌కు.. సాయిరెడ్డి లేఖ సంధించారు కూడా. తాజాగా ఇప్పు డు ర‌ఘురామ‌కు సంబంధించి జ‌రిగిన న‌గ‌దు లావాదేవీల గుట్టును సాయిరెడ్డి బ‌య‌ట‌పెట్ట‌డం సంచ‌ల నానికి దారితీసింది. ర‌ఘురామ‌కు-టీవీ అధిప‌తికి మ‌ధ్య జ‌రిగిన‌ ఒక మిలియన్‌ యూరో హవాలా లావాదేవీ లపై సీబీఐతో విచారణ జరిపించాలని విజయసాయిరెడ్డి ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంలో పీఎంఎల్‌ఏ, ఫెమా ఉల్లంఘనలు జరిగాయని ఆధారాలతో సహా ఆయన లేఖ రాశారు.

తనకు ఇప్పటి వరకు ఒక్కటి (కోటి రూపాయలు) మాత్రమే ఇవ్వగా ఇంకా పది (పది కోట్ల రూపాయలు) చెల్లించాల్సి ఉందంటూ రఘురామకృష్ణరాజు చాటింగ్‌లో స‌ద‌రు మీడియా అధినేత‌తో పేర్కొనటం ఫిర్యాదుతో జత చేసిన ఆధారాల పేజీ నెం:4లో వివరంగా ఉంది. ఎంపీ ర‌ఘురామ‌.. స‌ద‌రు మీడియా అధినేత మ‌ధ్య చట్టాలను ఉల్లంఘిస్తూ జరిగిన అక్రమ లావాదేవీ, మనీ లాండరింగ్‌పై ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు కీలక సాక్ష్యాధారాలను సేకరించారు. మనీలాండరింగ్, ఫారిన్ ఎక్స్‌చేంజ్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ 1999లోని పలు నిబంధనల ఉల్లంఘనలను ప్రాథమికంగా రుజువు చేసే సాక్ష్యాధారాలను కనుగొన్నారు.

దర్యాప్తులో భాగంగా ఏపీ సీఐడీ పోలీసులు కేసులో ప్రధాన నిందితుడి ఫోన్‌ను ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌లో శాస్త్రీయంగా విశ్లేషించినప్పుడు పది లక్షల యూరోల అక్రమ హవాలా వ్యవహారానికి సంబంధించిన ఆధారాలు బయటపడ్డాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ (ఏపీఎస్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌) అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఇచ్చిన నివేదికను కూడా ఈ ఫిర్యాదుతో జతపరిచాం.. అని సాయిరెడ్డి త‌న లేఖ‌లో వివ‌రించారు.

హవాలా లావాదేవీకి రుజువుగా ‘అంగడియా’ అనే ప్రస్తావన రఘురామకృష్ణరాజు, మీడియా అధినేత‌కు మధ్య సాగిన సంక్షిప్త సందేశాల సంభాషణలో ఉంద‌న్నారు. ఓసీబీసీ ఖాతా నుంచి ఒక మిలియన్‌ యూరోలు వెల్స్‌ ఫార్గో ఖాతాకు బదిలీ అయినట్టు ఈ సంభాషణ తేటతెల్లం చేస్తోంద‌ని తెలిపారు. ఇది మనీ లాండరింగ్‌ను రుజువు చేస్తోంది. లావాదేవీ ‘3’ అని చేసిన ప్రస్తావన హవాలా కింద ఇచ్చిన కోట్ల రూపాయల గురించి వెల్లడిస్తుండగా మిగిలినవి ఒక రోజు అనంతరం ఇస్తానని ఇచ్చిన హామీగా గుర్తించవ చ్చు.

ఏ-1 నిందితుడిగా ఉన్న రఘురామకృష్ణరాజుకు రెండో నెంబరు నిందితుడిగా ఉన్న మీడియా అధినేత మొత్తం రూ.11 కోట్ల మేర లావాదేవీల్లో రూ.కోటి చెల్లించినట్లు పేజీ నెంబరు 4లో ఉంది. ఈ వ్యవహారాన్ని పేజీ నెంబరు 5లో పేర్కొన్న మిలియన్‌ యూరో బదిలీ ప్రస్తావనలోనూ గమనించవచ్చ‌ని సాయిరెడ్డి వివ‌రించారు. నిందితులైన రఘురామకృష్ణరాజు, మీడియా అధిప‌తిలపై పీఎంఎల్‌ఏ, ఫెమా చట్టాల కింద కేసు నమోదు చేసి సీబీఐ విచారణకు ఆదేశించాలని ప్రధానిని విజయసాయిరెడ్డి కోరారు. నిందితులు విదేశాలకు పారిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని, కస్టడీలోకి తీసుకుని అనుమానాస్పద లావాదేవీలను వెలికి తీసేలా ఆదేశించాలని అన్నారు.

ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్‌కు సంబంధించి అనుమానాస్పద లావాదేవీలను వివరిస్తూ ఎన్‌ఫోర్స్ మెంట్‌ డైరెక్టరేట్‌కు సీఐడీ రాసిన లేఖను, సంభాషణలను ప్రధానికి పంపిన ఫిర్యాదులో విజయసాయిరెడ్డి జోడించారు. ప్రధాన నిందితుడు ఎంపీ రఘురామకృష్ణరాజుకి సంబంధించి సీజైన మొబైల్‌ ఫోన్‌ను ఏపీఎఫ్‌ఎస్‌ఎల్‌కు ఫోరెన్సిక్‌ విశ్లేషణ కోసం పంపామని, దాని నివేదిక అందిందని సీఐడీ తన లేఖలో పేర్కొంది. రఘురామకృష్ణరాజు(ఏ1), మీడియా అధిప‌తి(ఏ2)కు మధ్య జరిగిన లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నాయని, ఈ వ్యవహారంలో మనీలాండరింగ్‌ జరిగిందనడానికి తగిన ఆధారాలు ఉన్నాయని వివరించింది.


వెల్స్‌ ఫార్గో ఖాతా నెం: 51700263205 నుంచి పది లక్షల యూరోలను ఓసీబీసీ ఖాతా నెం: 501189518301కు బదిలీ చేసినట్లు ఆ ఫోన్‌ ఛాటింగ్‌ తేటతెల్లం చేసింది. ఇది పీఎంఎల్‌ఏ నిబంధనల ఉల్లంఘనను రుజువుగా నిలుస్తోంది. ఇద్దరు నిందితుల మధ్య జరిగిన కోట్ల రూపాయల మోసపూరిత హవాలా లావాదేవీలకు సంబంధించి ఈ ఫిర్యాదు పత్రంతో జత చేసిన ఆధారాల పేజీ నెంబర్లు 2, 3 లో ఛాటింగ్‌ వివరాలు ఉన్నాయి అని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఇది జాతీయ స్థాయిలో చ‌ర్చ‌కు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.