Begin typing your search above and press return to search.

భయమేల చంద్రబాబూ.. విజయసాయి ప్రశ్న!

By:  Tupaki Desk   |   16 July 2019 2:07 PM IST
భయమేల చంద్రబాబూ.. విజయసాయి ప్రశ్న!
X
తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డారు వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వి.విజయ సాయి రెడ్డి. ట్విటర్ వేదికగా మరోసారి ఆయన వరస ట్వీట్లతో చంద్రబాబు తీరును తప్పు పట్టారు. వైఎస్ జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు విషం చిమ్ముతున్నారంటూ ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తక్కువ కాలమే అయినా చంద్రబాబు నాయుడు అతిగా విమర్శలు చేస్తున్నారని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

''కొత్త ప్రభుత్వం వచ్చి 45 రోజులు కూడా కాకముందే విషం చిమ్మే ఈ విమర్శలేంటి చంద్రబాబు గారూ. మీ దుర్మార్గాలను అడ్డుకునేందుకే ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపారు. జగన్ గారు అమరావతికి ప్రాధాన్యతనివ్వడం లేదని శోకాలు పెడుతున్నారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆయనకి బాగా తెలుసు.'' అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

ఇక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సమీక్షించాలని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ఆక్షేపిస్తోంది. దీంతో ఆ అంశం మీద కూడా సాయి రెడ్డి స్పందించారు.

''సోలార్, పవన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై ప్రభుత్వం పున:పరిశీలన చేస్తానంటే మీరెందుకు వణికిపోతున్నారు చంద్రబాబు గారూ. కమీషన్లు మింగి చేసుకున్న పీపీఏల వల్ల ఏటా 2,500 కోట్ల ప్రజాధనం వృధా అయింది. యూనిట్ 2.70కి వస్తుంటే 4.84 చెల్లించారు. ఎవడబ్బ సొమ్మని దోచిపెట్టారు?'' అంటూ మరో ట్వీట్ లో ప్రశ్నించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ.