Begin typing your search above and press return to search.

ఆయనకు ఓటేయకపోతే దేవుడు చంపేస్తాడట

By:  Tupaki Desk   |   15 May 2016 4:42 AM GMT
ఆయనకు ఓటేయకపోతే దేవుడు చంపేస్తాడట
X
తమిళనాడులో ఎన్నికలొచ్చాయంటే సందడే సందడి. విచిత్ర ప్రచారాలతో.. ఊహించని ప్రలోభాలతో రాజకీయ పార్టీలు దుమ్ము రేపుతుంటాయి. ఓటర్లను బతిమలాడేవారు కొందరైతే భయపెట్టేవారు మరికొందరు. ఈ భయపెట్టడంలోనూ కొత్త తరహా విధానాలను తీసుకొస్తున్నారు డీఎండీకే అధినేత, నటుడు విజయ్ కాంత్. తనకు ఓటేయకపోతే దేవుడు ఆగ్రహిస్తాడని.. తనకు ఓటేయనివారిని చంపేస్తాడని ఆయన అంటున్నారు. దీంతో ఓటర్లు వీడెవడండీ బాబూ అనుకుంటున్నారట.

డీఎండీకే అధినేత విజయ్ కాంత్ ప్రచారాన్ని చూసినవారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. తన పార్టీకి ఓటు వేసి గెలిపించకపోతే తన కుల దైవం లక్ష్మీ నరసింహస్వామి ఓటర్ల ప్రాణాలు తీస్తాడని ఆయన ఓపెన్ గా చెబుతూ ప్రచారం చేస్తుండడంతొ అంతా ఆశ్చర్యపోతున్నారు. దైవం, చావు పేరుతో ఓటర్లను భయపెట్టి లబ్ధి పొందాలనన విజయ్ కాంత్ ఎత్తుగడలపై ఇతర రాజకీయ పార్టీల నుంచి విమర్శలొస్తున్నాయి.

తమిళనాడులో ప్రచారం ముగియడానికి కొద్దిగా ముందుగా విజయ్ కాంత్ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. విల్లుపురం జిల్లా ఊళుందూరుపేట నియోజక వర్గంలో పోటీ చేస్తున్న విజయకాంత్ ఆ ప్రాంతంలో శుక్రవారం రాత్రి వరకు బాగా ప్రచారం చేశారు. ఆ సందర్భంగా ఆయన మడపట్టు గ్రామంలో మాట్లాడుతూ ప్రస్తుతం మీడియాలో వచ్చే అభిప్రాయ సేకరణను ప్రజలు నమ్మవద్దని కోరారు. వాటి అన్నింటిని అధిగమించి ప్రజా సంక్షేమ కూటమి అమోఘ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మిగతా పార్టీలు డబ్బులిస్తున్నాయా అని అడిగి తెలుసుకున్నారు.. తాను ఓటర్లకు డబ్బులివ్వబోనని... పరిక్కల్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆ మేరకు ప్రమాణం చేశానని చెబుతూ... ‘నాకు మీరు ఓటు వేయకుంటే నరసింహస్వామి మిమ్మల్ని చంపకుండా వదలడు. నా లాగా ఇతర పార్టీల వారు అవినీతి చేయబోమని ప్రమాణం చేయగలరా’? అని అన్నారు.