Begin typing your search above and press return to search.

బాబు-సైబరాబాద్ గుట్టు విప్పిన విజయసాయిరెడ్డి

By:  Tupaki Desk   |   4 Dec 2018 10:55 AM GMT
బాబు-సైబరాబాద్ గుట్టు విప్పిన విజయసాయిరెడ్డి
X
‘‘హైదరాబాద్ ను ప్రపంచ పటంలో నేనే పెట్టా’.. ‘‘ఆధునిక తెలంగాణ సృష్టికర్తను నేనే’’.. ‘‘హైదరాబాద్ లో ఐటీ విప్లవానికి కారణం నేనే’’.. ‘‘సైబరాబాద్ ను నేనే కట్టా’’.. తెలుగుదేశం అధినేత.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తరచుగా చెప్పే మాటలివి. కానీ చంద్రబాబు రాకముందే హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధి మొదలైన మాట వాస్తవం. ఇక హైదరాబాద్ అభివృద్ధి అనేది నిజాం కాలం నుంచే ఉంది. ఈ విషయాలన్నీ తెలిసిన వాళ్లు హైదరాబాద్ లో చంద్రబాబు చేసింది రియల్ వ్యాపారం మాత్రమే అంటారు. తన వాళ్లతో భూములు కొనిపించి.. వాటి రేట్లు పెరిగేలా చేసి.. తద్వారా భారీ ప్రయోజనం పొందిన బాబు.. పైకి మాత్రం అభివృద్ధి క్రెడిట్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తారన్నది నిపుణుల వాదన.

ఇదే వాదనతో చంద్రబాబు గాలి తీసే ప్రయత్నం చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ అగ్రనేత.. ఎంపీ విజయ సాయిరెడ్డి. సైబరాబాద్‌ను తానే కట్టానని తెలంగాణ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పదే పదే చెబుతున్నారని.. కానీ సైబరాబాద్ నిర్మాణం వెనక పెద్ద స్కెచ్ ఉందని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఈ విషయమై విజయసాయిరెడ్డి ఒక ట్వీట్ చేశారు. ‘‘చంద్రబాబు కట్టానని చెప్పుకుంటున్న సైబరాబాద్‌ వెనుక భారీ స్కెచ్‌ ఉందన్నది బహిరంగ రహస్యం.

అక్కడ వందల ఎకరాల్లో రెపరెపలాడిన రియల్‌ ఎస్టేట్‌ జెండాలు బాబు బినామీలవి కావా? ఇప్పుడు అమరావతి.. భోగాపురంలో వేల ఎకరాల్లో ఆ పచ్చ యాక్టర్లే సాగిస్తున్న రియల్‌ వ్యాపారం "యూ టర్న్ బాబు" ఆశీస్సులతో కాదా?’’ అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. మరోవైపు చమురు ధరలకు వ్యతిరేకంగా ప్యారిస్‌లో జరుగుతున్న ఆందోళనలను ప్రస్తావిస్తూ చంద్రబాబును విమర్శించారు. ఫ్రాన్స్‌లో యెల్లో వెస్ట్ ఉద్యమం జరుగుతోందని.. త్వరలోనే 'యెల్లో వేస్ట్' అంటూ టీడీపీ పై ప్రజలు తిరగబడే రోజులు రాబోతున్నాయని ఆయన అన్నారు.