Begin typing your search above and press return to search.

పోల‌వ‌రం అక్ర‌మార్కుల గుండెల్లో రైళ్లు..!

By:  Tupaki Desk   |   2 Sep 2019 8:19 AM GMT
పోల‌వ‌రం అక్ర‌మార్కుల గుండెల్లో రైళ్లు..!
X
పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణ ప‌నుల్లో గ‌త టీడీపీ ప్ర‌భుత్వం భారీ స్థాయిలో అవినీతికి పాల్ప‌డిందా ? ఏకంగా రూ. 3,128.31 కోట్ల మేర అక్ర‌మాలు జ‌రిగాయా... విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ విభాగం నివేదిక‌లు ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నాయా.. ఈప్ర‌శ్న‌ల‌న్నింటికీ ఇప్పుడు అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. లోతుగా వి చారణ చేస్తే మరిన్ని అక్రమాలు బహిర్గతమయ్యే అవకాశం ఉందని అధికారులు ప్రభుత్వానికి నివే దించ‌డంతో అవినీతిప‌రుల గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతున్నాయి.

పోలవరం పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అక్రమాల నిగ్గు తేల్చేందుకు సిద్ధమైన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ విభాగం హెడ్‌ వర్క్స్ - కుడి - ఎడమ కాలువ పనులపై విచారణకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా అక్రమాలకు సూత్రధారులు - పాత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాంట్రాక్టర్లు దోచుకున్న ప్రజాధనాన్ని రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగించి తిరిగి వసూలు చేయనుంది.

టీడీపీ హయాంలో ఇంజినీరింగ్‌ పనుల్లో చోటు చేసుకున్న అవకతవకలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. తొలుత పోలవరం పనులపై విచారణ జ‌రిపిన‌ నిపుణుల కమిటీ రూ.3,128.31 కోట్ల మేర అక్రమాలు జరిగాయని తేల్చింది. లోతుగా విచారణ చేస్తే మరిన్ని అక్రమాలు బహిర్గతమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వానికి తెలిపింది. విజిలెన్స్‌ విభాగం డీజీ రాజేంద్రనాథ్‌ రెడ్డి పోలవరం పనులపై విచారణకు మూడు బృందాలను ఏర్పాటు చేశారు.

హెడ్‌ వర్క్స్ - కుడి - ఎడమ కాలువల పనుల్లో చోటు చేసుకున్న అక్రమాలపై ఈ మూడు బృందాలు వేర్వేరుగా విచారణ జరిపి నివేదిక ఇవ్వనున్నాయి. పనులను పర్యవేక్షించిన అధికారులు రాతపూర్వకంగా ఇచ్చే వివరణలో సూత్రధారుల పేర్లను వెల్లడిస్తే ప్రభుత్వం వారిపై కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోనుంది. విజిలెన్స్‌ విభాగం శరవేగంగా కదులుతుండటంతో గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతలు - ఇందులో ప్రమేయం ఉన్న అధికారులు - కాంట్రాక్టర్లలో వ‌ణుకు మొద‌లైంది.