Begin typing your search above and press return to search.

అయోధ్యకు రెండు ట్రక్కుల గ్రానైట్ రాళ్లు

By:  Tupaki Desk   |   21 Dec 2015 4:06 AM GMT
అయోధ్యకు రెండు ట్రక్కుల గ్రానైట్ రాళ్లు
X
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేసినవి ఐదు అంశాలుగా చెప్పొచ్చు. ఇందిర విధించిన అత్యవసర పరిస్థితి. రాజీవ్ హయాంలో బోఫోర్స్.. వీపీ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో వచ్చిన రిజర్వేషన్లు.. పీవీ హయాంలో అయోధ్యలోని వివాదాస్పద కట్టడం కూల్చివేత.. మన్మోహన్ హయాంలో 2జీ స్కాంగా చెప్పొచ్చు. ఈ ఐదు అంశాలు ఎప్పుడు తెర మీదకు వచ్చినా రచ్చ రచ్చే. ఈ ఐదింటిలో మిగిలిన నాలుగు అంశాల వ్యవహారం ఒకటైతే.. అయోధ్యలో వివాదాస్పద కట్టడం కూల్చివేత మరో అంశంగా చెప్పాలి. దేశాన్ని నిట్టనిలువుగా చీల్చేసి.. మత విద్వేషాలకు కారణమైందిగా చెప్పాలి. ఈ విషయంలో రెండు వర్గాల మధ్య వాదనలు ఓ పట్టాన తేలని పరిస్థితి.

అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగాలంటూ 2000 ముందు వరకూ దేశంలోని ఒక వర్గం ఊగిపోయిన పరిస్థితి. ఆ తర్వాత పరిస్థితులలో మార్పు రావటంతో పాటు.. వివాదాస్పద స్థలంలో రామాలయ నిర్మాణం అనే మాటపై భావోద్వేగం తగ్గుతూ వస్తున్న పరిస్థితి. లేనిపోని తలనొప్పులు తెచ్చి పెట్టుకునే కన్నా.. యథాతద స్థితిని కొనసాగించటం మంచిదన్న భావన పెద్ద ఎత్తున వ్యక్తమైంది. అదే సమయంలో.. వివాదాస్పద భూమి విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ.. దాని మీద న్యాయపరమైన పోరాటం ఇంకా కొనసాగుతున్న పరిస్థితి.

ఇదిలా ఉంటే.. అయోధ్యలోని వివాదాస్పద భూమికి కాస్త దూరంలో రామాలయ నిర్మాణానికి సంబంధించిన పనులను మొదలు పెట్టే దిశగా కేంద్రంలోని మోడీ సర్కారు అడుగులేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. బీజేపీ నుంచి గ్రీన్ సిగ్నల్ తమకు అందిందని వీహెచ్ పీ నేతలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా రెండు లారీలతో కూడిన గ్రానైట్ రాళ్లు అయోధ్యకు రావటం ఇప్పుడు సరికొత్త చర్చకు తెర తీసింది. రామాలయ నిర్మాణం విషయంలో స్టేటస్ కొనసాగిచటం మంచిదన్న వాదనకు భిన్నంగా.. రామాలయ నిర్మాణం దిశగా పడుతున్న అడుగులు దేశంలో సరికొత్త ఉద్రిక్తతలకు కారణమవుతుందన్న భావన పెరుగుతోంది.

అయోధ్యకు తెప్పించిన రెండు లారీల గ్రానైడ్ లోడ్ ను వీహెచ్ పీ ఒక ప్రైవేటు స్థలంలో ఉంచిందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలగకుండా చర్యలు తీసుకుంటామని చెబుతున్న పోలీసులు ఒకవైపు చెబుతుంటే.. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి త్వరలోనే తెర తీయనున్నట్లుగా వీహెచ్ పీ నేతలు చెబుతున్నారు. అయోధ్యలో నిర్మించే రామ మందిర నిర్మాణానికి అవసరమైన రాళ్లను దేశవ్యాప్తంగా సేకరించనున్నట్లు వీహెచ్ పీ నేతలు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కొద్ది నెలల్లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలోనే ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా అయోధ్యలో రామాలయ నిర్మాణం దేశవ్యాప్తంగా ఉద్రిక్తతల్ని పెంచుతుందనటంలో సందేహం లేదు. ఈ విషయంలో మోడీ సర్కారు అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటేనే మంచిది.