Begin typing your search above and press return to search.

వేం న‌రేంద‌ర్ కు వ‌చ్చిన కాల్స్ ఎవ‌రు చేశారు?

By:  Tupaki Desk   |   13 Feb 2019 5:20 AM GMT
వేం న‌రేంద‌ర్ కు వ‌చ్చిన కాల్స్ ఎవ‌రు చేశారు?
X
ఓటుకు నోటు కేసుకు సంబంధించి కీల‌క ప‌రిణామం ఒక‌టి చోటు చేసుకుంది. ఈ వ్య‌వ‌హారంలో మ‌నీ లాండ‌రింగ్ పాత్ర ఉంద‌ని భావించిన ఈడీ రంగ‌ప్ర‌వేశం చేయ‌టం.. మాజీ ఎమ్మెల్యే వేం న‌రేంద‌ర్ రెడ్డిని విచారించ‌టం తెలిసిందే. దాదాపు ఏడున్న‌ర గంట‌ల పాటు సాగిన విచార‌ణ‌లో ఈడీ అధికారులు ప‌లు ప్ర‌శ్న‌లు సంధించిన‌ట్లు చెబుతున్నారు. దాదాపు నాలుగేళ్ల క్రితం జ‌రిగిన ఉదంతం.. దానికి సంబంధించిన సాంకేతిక అంశాల‌తో కూడిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పేందుకు వేం కాస్త ఇబ్బంది ప‌డిన‌ట్లుగా స‌మాచారం.

చాలా ప్ర‌శ్న‌ల‌కు స‌రిగా గుర్తు లేద‌న్న మాట‌ను చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. వేం న‌రేంద‌ర్ తో పాటు.. ఆయ‌న ఇద్ద‌రు కొడుకుల్ని పిలిచిన ఈడీ అధికారులు.. వారిని సైతం విచారించారు. ఈ సంద‌ర్భంగా ముగ్గురికి కొన్ని కామ‌న్ ప్ర‌శ్న‌లు వేశార‌ని.. స‌మాధానాలు వేర్వేరుగా ఉన్నాయ‌న్న మాట వినిపిస్తోంది. అధికారుల విచార‌ణ ముగించుకొని బ‌య‌ట‌కు వ‌చ్చిన వేం న‌రేంద‌ర్ రెడ్డికి.. ఆయ‌న కొడుకుల‌కు వ‌రుస పెట్టి ఫోన్ కాల్స్ వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది.

ఈ కాల్స్ మొత్తం అమ‌రావ‌తి నుంచే వ‌చ్చాయ‌ని చెబుతున్నారు. విచార‌ణ‌లో భాగంగా ఈడీ అధికారులు ఏమేం ప్ర‌శ్న‌లు సంధించారు. ఏ ప్ర‌శ్న‌కు ఏమ‌ని స‌మాధానం ఇచ్చారు? ఈడీ దృష్టి మొత్తం దేనిపైన ఉంది? వారి త‌దుప‌రి చ‌ర్య‌లు ఎలా ఉండ‌నున్నాయి? లాంటి వాటి చుట్టూనే ఫోన్ సంభాష‌ణ‌లు సాగిన‌ట్లుగా తెలుస్తోంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. విచార‌ణ త‌ర్వాత వేం న‌రేంద‌ర్ కు వ‌చ్చిన ఫోన్ కాల్స్ పైన ట్యాప్ జ‌రిగి ఉంటుంద‌న్న మాట వినిపిస్తోంది. కాస్త ఆల‌స్యంగా వ‌చ్చిన ఈప్ర‌చారంతో తెలుగు త‌మ్ముళ్లు ఉలిక్కి ప‌డుతున్న‌ట్లుగా చెబుతున్నారు. మొత్తంగా ఈడీ విచార‌ణ ఏమో కానీ.. తెలుగు త‌మ్ముళ్ల‌ను హైరానాలో ప‌డేసిన‌ట్లుగా తెలుస్తోంది.కీల‌క‌మైన ఎన్నిక‌లు ముంగిట్లోకి వ‌చ్చేసిన వేళ‌.. అప్ప‌టి ఓటుకు నోటు కేసు తెర మీద‌కు రావ‌టంతో తెలుగు త‌మ్ముళ్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.