Begin typing your search above and press return to search.

వీర సావర్కర్ కు జాతిపిత హోదానా ?

By:  Tupaki Desk   |   13 Oct 2021 8:58 AM GMT
వీర సావర్కర్ కు జాతిపిత హోదానా ?
X
మహాత్మా గాంధి స్ధానంలో తొందరలోనే వీర సావర్కర్ కు బీజేపీ పెద్దలు జాతిపిత హోదాను కల్పించబోతోందా ? కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాధ్ తాజా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు చేస్తున్న కామెంట్లు ఇదే అనుమానాన్ని పెంచేస్తున్నాయి. వినాయక్ దామోదర్ సావర్కార్ పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా రాజ్ నాథ్ మాట్లాడుతు అండమాన్ జైల్లో ఉన్న సావర్కార్ ను బ్రిటీషర్లకు క్షమాభిక్ష పెట్టుకోమని మహాత్మా గాంధి చెప్పినట్లు కేంద్రమంత్రి చెప్పారు. దీనిపై చరిత్రకారులు, నెటిజన్లు, రాజకీయనేతలు కూడా మండిపోతున్నారు.

బ్రిటీషర్లకు వీరసావర్కార్ క్షమాభిక్ష లేఖ రాయటానికి మహాత్మాగాంధికి సంబంధమే లేదని మండిపడుతున్నారు. ఎందుకంటే వీరసావర్కర్ బ్రిటీషర్లకు క్షమాభిక్ష లేఖ రాసింది 1911లో అయితే మహాత్మాగాధి దక్షిణాఫ్రికా నుండి భారత్ కు తిరిగొచ్చింది 1915లో అని చరిత్రకారులు చెబుతున్నారు. మహాత్మాగాంధి భారత్ కు ఎప్పుడు వచ్చారు ? వీరసావర్కర్ బ్రిటీషర్లకు క్షమాభిక్ష లేఖ రాసిందెపుడు అనే విషయం ఇంత స్పష్టంగా ఉన్నా రాజ్ నాధ్ చరిత్రను ఎందుకు వక్రీకరిస్తున్నారంటు నెటిజన్లు మండిపడుతున్నారు.

కేంద్రమంత్రి చెప్పింది చూసిన తర్వాత భారతదేశ చరిత్రను వక్రీకరించటానికి, తప్పుడు చరిత్రను భవిష్యత్తరాలకు అందించటానికి బీజేపీ పెద్దలు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు చరిత్రకారులు ఆరోపిస్తున్నారు. చరిత్రను ధ్వంసంచేసి తప్పుడు చరిత్రను లిఖించేందుకు కూడా బీజేపీ నేతలు వెనకాడటం లేదంటు నెటిజన్లు రెచ్చిపోతున్నారు. తెరవెనుక ఏదో కుట్ర మొదలుపెట్టిన కారణంగానే కేంద్రమంత్రి మహాత్మాగాంధీపై ఇలాంటి వ్యాఖ్యలను చేసినట్లు అందరు అనుమానిస్తున్నారు.

కేంద్రమంత్రిపై తాజా వ్యాఖ్యలను తప్పుపడుతున్న వారిలో చరిత్రకారులు, కాంగ్రెస్ నేతలు, నెటిజన్లతో పాటు ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఓవైసీ కూడా ఉండటం ఆశ్చర్యంగా ఉంది. చరిత్రను ధ్వంసం చేయటానికి బీజేపీ నేతలు తెరతీసినట్లు ఓవైసీ కూడా మండిపోయారు. జాతిపిత హోదాలో మహాత్మాగాధి సరసన వీర సావర్కర్ ను కూడా బీజేపీ పెద్దలు ఉంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని లేదా గాంధీకి బదులు సావర్కర్ ను మాత్రమే జాతిపితగా హైలైట్ చేయాలని బీజేపీ నేతలు కుట్రలు మొదలుపెట్టినట్లు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.