Begin typing your search above and press return to search.

ఫ్యాన్ నీడన ఉక్కబోత...సైకిలెక్కేస్తారా...?

By:  Tupaki Desk   |   1 May 2022 3:30 AM GMT
ఫ్యాన్ నీడన ఉక్కబోత...సైకిలెక్కేస్తారా...?
X
ఆయన రాజకీయ జీవితం టీడీపీతోనే స్టార్ట్ అయింది. మూడు సార్లు ఆ పార్టీ టికెట్ ఇస్తే రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఆయనే విశాఖ జిల్లా సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. ఆయనను పార్టీ బాగానే గౌరవించింది. విశాఖ జిల్లా ప్రెసిడెంట్ గా పలుమార్లు నియమించింది. గత ప్రభుత్వంలో ప్యానల్ స్పీకర్ గా చాన్స్ ఇచ్చింది. మత్య్సకార కమ్యూనిటీకి చెందిన వాసుపల్లి ఎక్స్ సర్వీస్ మెన్. దాంతో ఆయన విద్యాధికుడిగా కూడా వైసీపీ నుంచి గౌరవం అందుకున్నారు.

ఒకనాడు జగన్ విశాఖ టూర్ కి విపక్ష నేతగా వస్తే ఆయన ప్రసంగం చేసిన ప్రదేశాన్ని పసుపు నీళ్ళతో కడిగిన కరడు కట్టిన టీడీపీ నేత వాసుపల్లి చిత్రంగా ఓ అనుకోని వేళ వైసీపీకి జై కొట్టారు. ఆయన గత రెండేళ్ళుగా వైసీపీలోనే ఉన్నారు. దానికి కారణం ఆయనకు ఉన్న విద్యా సంస్థల మీద అధికార పార్టీ నాడు దాడి చేయించడం వంటివే అని చెబుతారు.

ఇలా తన సొంత వ్యాపారాలకు దెబ్బ తగలకుండా ఆయన వైసీపీలో చేరారు అని చెబుతారు. ఇక ఆయన వైసీపీలో ఉన్నా ఆ పార్టీ నాయకులతో ఎడం పాటిస్తున్నారు. తాను టీడీపీ నుంచి తెచ్చుకున్న నాయకులకే ప్రయారిటీ ఇస్తున్నారు. సొంతంగా ప్రజా దర్బార్ లను నిర్వహిస్తూ తన ఇమేజ్ ని కాపాడుకుంటున్నారు.

ఇక వైసీపీతో అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఈ మధ్య వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా అవంతి శ్రీనివాసరావు ప్రమాణం చేస్తే ఆ కార్యక్రమానికి వాసుపల్లి డుమ్మా కొట్టడం చర్చనీయాంశం అయింది. చాలా కాలంగా వాసుపల్లి పోకడలను వైసీపీ నేతలూ గమనిస్తున్నారు.

అయితే ఆయన వైసీపీలో కొనసాగడం వెనక కొన్ని రాజకీయ కారణాలు ఉన్నాయని అంటున్నారు. సౌత్ లో టీడీపీ కొత్త ఇంచార్జిని ప్రకటించింది. ఆయనే మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ. ఆయన అక్కడ దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకే టికెట్ కన్ ఫర్మ్ అని చెబుతున్నారు. దాంతో టీడీపీలోకి తిరిగి వెళ్ళినా టికెట్ దక్కుతుందా అన్న డౌట్ ఆయనకు ఉంది.

మరో వైపు చూస్తే ఆ మధ్య విశాఖలో చంద్రబాబు టూర్ చేసినపుడు వాసుపల్లి మీద ఇండైరెక్ట్ గా హాట్ కామెంట్స్ చేశారు. పార్టీ పరంగా ఎన్నో అవకాశాలు ఇచ్చమని, ఎమ్మెల్యేగా రెండు సార్లు చేస్తే ఆయన వెన్నుపోటు పొడిచారని బాబు మధనపడ్డారని వార్తలు వచ్చాయి. దాంతో ఆయన వస్తే గిస్తే పార్టీలో చేర్చుకుంటారేమో కానీ టికెట్ మాత్రం ఇవ్వరని అంటున్నారు.

దాంతో ఈ ఎమ్మెల్యే ఏం చేయాలో తెలియక నలిగిపోతున్నారు అంటున్నారు. ఇక మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీలో యాక్టివ్ కావడంతో ఆయన ద్వారా తన విన్నపాలను తెలియచేసుకుని సైకిల్ ఎక్కే వ్యూహాలకు పదును పెడుతున్నారు అని అంటున్నారు. మరి గంటాతో ఆయనకు ఉన్న సాన్నిహిత్యం పనికి వస్తుందా. గంటా చెబితే ఆయనకు టికెట్ వస్తుందా అన్నది చూడాలి.

ఇక పోతే గండి బాబ్జీ తో పోలిస్తే సౌత్ లో సామాజికవర్గం పరంగా జనాలతో నిరంతరం టచ్ లో ఉన్న నేతగా వాసుపల్లికే ఎక్కువ మార్కులు పడతాయి. దాంతో చివరి నిముషంలో హై కమాండ్ కీలక నిర్ణయం తీసుకుంటే వాసుపల్లికి టికెట్ దక్కినా దక్కవచ్చు అంటున్నారు. దాంతో ఆయన ఫ్యాన్ నీడన ఉక్క బోత భరిస్తూనే సైకిలెక్కే చాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు అంటున్నారు.