Begin typing your search above and press return to search.

అతి చేసి ఇరుక్కుపోయిన బీజేపీ స‌ర్కారు

By:  Tupaki Desk   |   23 Jun 2017 10:51 AM GMT
అతి చేసి ఇరుక్కుపోయిన బీజేపీ స‌ర్కారు
X
అధికారంలో ఉన్న‌వారు త‌మ చ‌ర్య‌ల ప‌ట్ల వీలైనంత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది. ఎందుకంటే వేలాది మంది క‌ళ్లు స‌హ‌జంగానే పాల‌కుల‌పై ఉంటాయి కాబ‌ట్టి. త‌మ పాల‌న గురించి ప్ర‌చారం చేసుకోవ‌డం ఎంత అవ‌స‌ర‌మో....అతి కాకుండా చూసుకోవ‌డం అంటే అవ‌స‌రం. అలా అతి చేసి ఇరుక్కుపోయిన‌ట్లు రాజస్ధాన్‌ లో వసుంధరరాజె నేతృత్వంలోని బీజేపీ స‌ర్కారు గురించి ప్ర‌చారం జ‌రుగుతోంది. రాష్ట్రంలో దారిద్య్రరేఖన దిగువన ఉన్న కుటుంబాలకు సబ్సిడీపై ఆహార ధాన్యాలు ఇచ్చే క్రమంలో వారి ఇళ్ల‌ గోడలపై 'మేము పేదలం' అని పెయింటింగ్‌ వేయాలని అధికారులు ఆదేశించ‌డం వివాదాస్పదమైంది.

సిక్రాయి - బండికు ప్రాంతంలో దాదాపు 50,000కు పైగా ఇళ్ల‌పై ఇలాంటి మార్కింగ్‌ లు వేశారని జాతీయ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. కొన్ని ఇళ్ల‌ బయటి గోడల నిండా ఇలాంటి రాతలతో నింపారు. దౌసా జిల్లాలో అధికారులు బలవంతంగా ఇలా రాయిస్తున్నారని స్ధానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజికంగా - ఆర్థికంగా వెనుకబడిన ఎస్‌ సీ - ఎస్‌ టీ - మైనారిటీ వర్గాల్లోనే బీపీఎల్‌ కుటుంబాలు అధికంగా ఉన్నారు. 'మాకు ఇచ్చే పది కిలోల గోధుమల కోసం అధికారులు మమ్మల్ని ఇలా ఇబ్బందిపెడుతున్నారు. ఇళ్ల‌పై ఇలాంటి రాతలతో మేం తలెత్తుకుని తిరగలేకపోతున్నాం` అని ఓ గ్రామస్తుడు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల తీరుతో మనస్తాపం చెందిన పలువురు తమ ఇళ్ల‌పై రాతలను చెరిపివేశారు. సబ్సిడీ ఆహారధాన్యాలు తమకు అవసరం లేదని తేల్చిచెప్పారు. మరోవైపు ఇళ్ల‌పై ఇలాంటి రాతలకు అంగీకరించినవారికి ప్రభుత్వం రూ 750 నగదు ప్రోత్సాహకం ప్రకటించింది. అయితే ధనికులు కూడా ఈ పథకాలను ఉపయోగించుకోకుండా అడ్డుకునేందుకే ఈ పని చేస్తున్నామని అధికారులు పేర్కొనడం గమనార్హం.

సబ్సిడీ ఆహారధాన్యాలు స్వీకరిస్తున్న వారి ఇళ్ల‌పై ఈరకమైన రాతల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది పేదలను అవమానించడమేనని విపక్షాలు ఆరోపించాయి. 'ఆహారభద్రత చట్టం కింద వారికి రేషన్‌ ఇస్తున్న క్రమంలో అది వారి హక్కు ..అది ప్రభుత్వ ఛారిటీ ఎంతమాత్రం కాదు.. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాల పేదల వ్యతిరేక విధానానికి ఇది నిదర్శనం` అని కాంగ్రెస్ పార్టీ నేత మనీష్‌ తివారీ మండిప‌డ్డారు. పేదలను వసుంధరరాజె ప్రభుత్వం అవమానిస్తున్నదని రాజకీయ, సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్‌ విమర్శించారు. అయితే ఈ వివాదంపై దౌసా అడిషనల్‌ కలెక్టర్‌ కేసీ శర్మ వివరణ ఇచ్చారు. జిల్లా యంత్రాంగం దీనికి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని, అనర్హులు సైతం ఆహారభద్రత చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ లబ్ధిపొందుతున్నారనే ఫిర్యాదులతో జిల్లా పరిషత్‌ అధికారులు ఈ ఆదేశాలు జారీచేశారని చెప్పారు. తాజాగా జ‌రుగుతున్న ఈ పంచాయ‌తీ కార‌ణంగా వచ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న‌ అసెంబ్లీ ఎన్నికల్లో వ్య‌తిరేక ప‌వ‌నాలు వీచే అవ‌కాశం ఉంద‌ని ప‌లువురు అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/