Begin typing your search above and press return to search.

మద్యంపై ఉన్న విజన్ మంచినీటిపై లేదా?

By:  Tupaki Desk   |   6 Oct 2016 4:21 PM GMT
మద్యంపై ఉన్న విజన్ మంచినీటిపై లేదా?
X
మద్యం విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలపై విపక్ష వైసీపీ మండిపడుతోంది. ముఖ్యమంత్రికి మద్యంపై ఉన్న విజన్ మంచినీటిపై లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఈరోజు విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో మద్యం షాపులను పుట్టగొడుగుల్లా ఏర్పాటు చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యాన్ని నియంత్రించి ప్రజల బతుకులను బాగు చేయాల్సింది పోయి మద్యం షాపులను పెంచుతాం - మద్యాన్ని ఏరులా పారిస్తాం అనే రీతిలో ముఖ్యమంత్రి ప్రకటనలు చేస్తున్నారంటూ ఆమె ధ్వజమెత్తారు.

ఏపీలో ఇప్పటికే మద్యం దుకాణాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. వినియోగం కూడా అధికంగా ఉంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఉన్నదానికన్నా ఎక్కువ మద్యాన్ని ఉత్పత్తి చేయాలనుకోవడం దారుణమైన నిర్ణయమని ఆమె ఆరోపించారు. చంద్రబాబు పాలనలో నవ్యాంధ్రప్రదేశ్ మద్యాంధ్రప్రదేశ్ గా మారుతోందంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఖజానా నింపుకోవడమే చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తుందని.. ఆ ప్రయత్నంలో పేదల ఆరోగ్యం - జీవితాలతో ఆడుకుంటున్నారని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని చెప్పుకుంటున్న చంద్రబాబు డబ్బు కోసం మద్యాన్ని ఏరులై పారించడం ఎంతవరకు సబబని పద్మ ప్రశ్నించారు. అవినీతిలో దేశంలోనే ఏపీ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోందని పద్మ ఎద్దేవా చేశారు. మద్యం వ్యాపారుల నుంచి టీడీపీ నేతలు ప్రతి నెలా ముడుపులు తీసుకుంటున్నారని ఆమె ఆరోపించారు. ఆ విషయం చంద్రబాబుకు కూడా తెలుసని అన్నారు. మద్యం విక్రయాల విషయంలో ఆబ్కారీ శాఖకు భారీ టార్గెట్లు ఇవ్వడం.. ఉత్పత్తి పెంచుకునే దిశగా పావులు కదుపుతున్న నేపథ్యంలో ఆమె ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/