Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబే పెద్ద దొంగ‌.. ఆయ‌న చేతికే తాళాలా?

By:  Tupaki Desk   |   29 Nov 2016 11:19 AM GMT
చంద్ర‌బాబే పెద్ద దొంగ‌.. ఆయ‌న చేతికే తాళాలా?
X
న‌ల్ల‌ధ‌నం అరిక‌ట్ట‌డంలో భాగంగా కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం త‌రువాత ఆ ప్ర‌భావంపై అధ్య‌య‌నం చేసేందుకు... ఇబ్బందుల‌ను అధిగ‌మించేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై అధ్య‌య‌నానికి ఐదు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులతో వేసిన క‌మిటీకి ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడును చైర్మ‌న్ గా నియ‌మించ‌డంపై వైసీపీ తీవ్రంగా మండిప‌డింది. చంద్ర‌బాబే పెద్ద న‌ల్ల దొంగ అని... ఆయ‌న న‌ల్ల డ‌బ్బుతో వైసీపీ ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేశార‌ని... అలాంటి వ్య‌క్తికి ఇలాంటి కీల‌క బాధ్య‌త అప్ప‌గించ‌డ‌మంటే అది దొంగ చేతికి తాళం ఇచ్చిన‌ట్లేన‌ని వైసీపీ నేత వాసిరెడ్డి ప‌ద్మ ఆరోపించారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ - ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఆడియో - వీడియో టేపులు... విదేశాలలోని నల్లధనం గురించి కేంద్ర ప్రభుత్వానికి పట్టదా? అని ప్రశ్నించారు.

పెద్దనోట్ల రద్దు విషయమై ప్రశ్నించాల్సిన చోట నోరెత్తని చంద్రబాబు - బ్యాంకర్లపై మాత్రం మండిపడుతున్నారని అన్నారు. మరో నాలుగు రాష్ట్రాల్లో తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించేందుకే చంద్రబాబు ఈ కమిటీకి సారథ్యం వహిస్తున్నారని ఆమె ఆరోపించారు. సామాన్యుల తరుపున చంద్రబాబు ఒక్కమాట కూడా మాట్లాడలేదని అన్నారు. కనీసం ప్రజల కష్టాలను ప్రధాని దృష్టికి కూడా చంద్రబాబు తీసుకెళ్లలేదని మండిపడ్డారు.

అనేక కేసుల్లో ఉన్న చంద్ర‌బాబు సీఎంల కమిటీకి సారథ్యం ఎలా వహిస్తారని ప్రశ్నించారు. చంద్రబాబుకు నేతృత్వం అప్పగిస్తే దేశం సర్వనాశనమే అని మండిపడ్డారు. న‌ల్ల‌ధ‌నం దొంగ‌కు ఇలాంటి కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం మోడీ ప్ర‌భుత్వం చేస్తున్న మ‌రో త‌ప్ప‌ని ఆమె విరుచుకుప‌డ్డారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/