Begin typing your search above and press return to search.

రైతుల‌కు ఇళ్లు క‌ట్టిన రాహుల్ త‌మ్ముడు

By:  Tupaki Desk   |   19 Oct 2016 8:21 AM GMT
రైతుల‌కు ఇళ్లు క‌ట్టిన రాహుల్ త‌మ్ముడు
X
నారా చంద్ర‌బాబునాయుడు చేయ‌ని ప‌ని - న‌రేంద్ర‌మోడీ చేయ‌ని ప‌ని.. కేసీఆర్ చేయ‌నిప‌ని - సోనియా - రాహుల్ గాంధీలు చేయ‌ని ప‌నిని ఆ కుర్ర నేత చేసి చూపించేశారు. తెలుగు రాష్ట్రాల్లో రైతులు అప్పుల ఊబిలో చిక్కుకుని విల‌విల‌లాడుతుంటే మ‌న ప్ర‌భుత్వాలు ఆదుకున్న‌ది అంతంత‌మాత్ర‌మే. జాతీయ స్థాయి నేత‌ల నుంచి దీనిపై స్పంద‌న క‌రువే. రాహుల్ గాంధీ కూడా పాద‌యాత్ర‌లు చేసి ప్ర‌భుత్వాల‌ను విమ‌ర్శించ‌డ‌మే కానీ రైతుల‌కు ప‌నికొచ్చే ప‌ని మాత్రం చేయ‌లేక‌పోయారు. కానీ, ఆయ‌న సోద‌రుడు వ‌రుణ్ గాంధీ చేత‌ల్లో త‌న స‌త్తా చూపించారు. ఆస్తులు అమ్ముకుని అప్పుల్లో కూరుకుపోయిన రైతుల‌కు త‌ల‌దాచుకోవడానికి గూడు క‌ల్పించారు. ఇప్పుడు దేశ రాజ‌కీయాల్లో వ‌రుణ్ గాంధీ హాట్ టాపిగ్గా మారిపోయారు.

అప్పుల ఊబిలో చిక్కుకుని - అనేక కష్టాలు అనుభవిస్తున్న 28 మంది పేద రైతులకు బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఇళ్లు నిర్మించి ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ లో అతని సొంత నియోజకవర్గమైన సుల్తాన్ పూర్ లోని లంభువా బ్లాక్ లో ఉచిత ఇళ్ల‌ను నిర్మించారు.పంట రుణాలను తిరిగి చెల్లించలేక‌ పోయినవారు - పంటను పూర్తిగా నష్టపోయిన‌వారు, ఎలాంటి ఆస్తులు లేనివారి కోసం ఆయ‌నే ఇళ్ల‌ను క‌ట్టారు.

సొంత డ‌బ్బులు.. స్వ‌చ్ఛందంగా కొంద‌రు అందించిన విరాళాల‌తో వాటిని ఆయ‌న నిర్మించారు. రాజ‌కీయాల‌కు దీనికి సంబంధం లేద‌ని, ముందుముందు మ‌రిన్ని ఇళ్ల‌ను రైతుల కోసం క‌డ‌తామ‌ని వ‌రుణ్ గాంధీ ప్ర‌క‌టించారు. యూపీలో బీజేపీ ప‌ర‌మైన ఇమేజితో పాటు వ్య‌క్తిగ‌త ఇమేజిను కూడా పెంచుకునేందుకు క‌స‌రత్తు చేస్తున్న వ‌రుణ్ ఆ క్ర‌మంలో బాగానే దూసుకెళ్తున్న‌ట్లుగా ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/