Begin typing your search above and press return to search.

కేసీఆర్ పై వేలెత్తి చూపిస్తున్న ఎన్ కౌంటర్

By:  Tupaki Desk   |   6 Nov 2016 5:08 AM GMT
కేసీఆర్ పై వేలెత్తి చూపిస్తున్న ఎన్ కౌంటర్
X
రాజకీయాలు మహా చిత్రంగా ఉంటాయి. కొన్ని విషయాలకు ఎంత దూరంగా ఉండాలని అనుకున్నా.. వాటి దగ్గర్లోకి వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. తాజాగా అలాంటి పరిస్థితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ది. కొన్ని కొన్ని వివాదాలకు.. కీలక అంశాల విషయాల్లో ఆయన తనకేం సంబంధం లేకుండా ఉన్నట్లుగా వ్యవహరిస్తారు. ఆ మధ్య హెచ్ సీయూలో రోహిత్ వేముల ఆత్మహత్య కావొచ్చు.. ఇటీవల ఏపీ.. ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లాంటి అంశాల విషయాల్లో ఆయన పెదవి కూడా విప్పరు. ఆ మాటకు వస్తే.. అసలు తనకేం సంబంధం లేదన్నట్లుగా.. తన చుట్టూ అలాంటివేమీ జరగనట్లుగా వ్యవహరిస్తారు. అయితే.. అలాంటి వాటికి ఎంత దూరంగా ఉండాలని ప్రయత్నించినా.. అవి తమ వెంట పడతాయన్న వాస్తవం మరోసారి నిజమైంది. తాజాగా జరిగిన ఎన్ కౌంటర్ కు సంబంధించి విరసం నేత వరవరరావు తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

హత్యల్లో తెలంగాణ ముఖ్యమంత్రి మొదటి స్థానమని.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి రెండో స్థానంలో నిలుస్తారని ఆయన మండి పడ్డారు. ఏవోబీలో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురుతెలంగాణ ప్రాంతానికి చెందిన వారు ఉన్నారని.. వారి గురించి తెలంగాణ ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. నక్సల్స్ ఉద్యమాన్ని అణిచివేసేందుకు కోవర్ట్ ఆపరేషన్ చేపట్టాలని గతంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి నివేదిక ఇచ్చారని ఆరోపించారు. ఇప్పటివరకూ ఏవోబీ ఎన్ కౌంటర్ వ్యవహారంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తావనను ఎవరూ తీసుకురాలేదు. తాజాగా వరవరరావు తీవ్ర ఆరోపణలు చేస్తూ.. సీన్లోకి కేసీఆర్ ను తీసుకురావటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/