Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్‌ లో ఎందుకు చేరానో చెప్పిన ప్ర‌తాప్‌ రెడ్డి

By:  Tupaki Desk   |   18 Jan 2019 4:32 PM GMT
టీఆర్ ఎస్‌ లో ఎందుకు చేరానో చెప్పిన ప్ర‌తాప్‌ రెడ్డి
X
రాజ‌కీయ వ‌ర్గాలు ఊహించిందే జ‌రిగింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో గులాబీ ద‌ళ‌ప‌తి - తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ పై పోటీ చేసి ఓటమి పాలైన కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి పార్టీ మారారు. గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్ లో టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ప్రతాప్ రెడ్డి - ఆయన కార్యకర్తలు గులాబీ దళంలో చేరారు. పార్టీ కండువా కప్పిన కేటీఆర్ ప్రతాప్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. అందువల్లే రెండు సార్లు ఓడిపోయానని తెలిపారు. ``సీఎం కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహించడం గజ్వేల్ ప్రజలు చేసుకున్న అదృష్టం. నాలుగేళ్లలో గజ్వేల్ రూపురేఖలు మారిపోయాయి. ప్రజలు అడగకుండానే సీఎం కేసీఆర్ ఎన్నో పనులు చేశారు. పార్టీ ఆదేశాల మేరకు పనిచేస్తా. ప‌ద‌వుల కోసం కాకుండా నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి కోసం ప‌నిచేస్తా`` అని పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలవాలనే తాపత్రయంతో కొట్లాడాను కానీ.. సీఎం కేసీఆర్ ను ఓడించాలని ఎప్పుడూ అనుకోలేదని ప్ర‌తాప్ రెడ్డి తెలిపారు. అహర్శిశలు కష్టపడి పార్టీ కోసం పని చేస్తానని తెలిపారు. 2009లోనే త‌న‌ను పార్టీలో చేరాల‌ని కోరార‌ని, అయితే ఇప్పుడు చేరుతున్నాన‌ని అన్నారు. ఇటీవ‌ల తాను చేసిన విమ‌ర్శ‌లన్నింటినీ వెన‌క్కు తీసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కలిసి పనిచేద్దామని గతంలో కూడా ఒంటేరును కోరామని గుర్తు చేశారు. పదేండ్ల సమయం పట్టినా.. ఒంటేరు మంచి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. గజ్వేల్ లో నిధుల వరద పారుతోందన్నారు. కేసీఆర్ స్వప్నం కోటి ఎకరాల మాగాణి త్వరలో సాకారం అవుతుందని చెప్పారు. గజ్వేల్ లో ఇకపై ఏ ఎన్నిక వచ్చినా ఏక పక్షమేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో అభివృద్ధి వేగం పెరగాలని ఆకాంక్షించారు. 16 ఎంపీ స్థానాలు గెలుచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవాలన్నారు.