Begin typing your search above and press return to search.

వంగవీటి రాధా హత్యకు రెక్కీ జరిగిందా? ఎవరన్నారు?

By:  Tupaki Desk   |   26 Dec 2021 3:30 PM GMT
వంగవీటి రాధా హత్యకు రెక్కీ జరిగిందా? ఎవరన్నారు?
X
తెలుగు రాజకీయాల్లో ప్రాంతాలతో సంబంధం లేకుండా అభిమానులు ఉన్న నేతలు కొందరు ఉన్నారు. ఆ కోవలోకే వస్తారు దివంగత నేత వంగవీటి మోహన రంగా. ఆయన మరణించి 33 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికి ఆయనకున్న క్రేజ్ మరింత పెరిగిందే కానీ తగ్గలేదు. ఆ మాటకు వస్తే.. ఈ రోజుకు పలు జిల్లాల్లో ఆయన పేరు ప్రస్తావించి.. ఆయన భావాలకు తాను ఆకర్షితులయ్యాననో.. ఆయన తీరును పొగడటం లాంటి మాటలు పలువురు నేతల నోట వినిపిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన కుమారుడు వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు చేశారు.

తనను హత్య చేయటానికి రెక్కీ నిర్వహించారని కొత్త బాంబు పేల్చారు. తనను హత్య చేయటానికి కుట్ర జరుగుతోందన్న ఆయన.. తాను దేనికైనా సిద్ధమని పేర్కొన్నారు. దీంతో.. వంగవీటి రాధాను హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉందన్న ప్రశ్న మొదలైంది. తన తండ్రి వర్థంతి రోజునే రాధా నోటి నుంచి ఈ తరహా వ్యాఖ్య రావటం ఇప్పుడు సంచలనంగా మారింది.

తనను ఏదో చేద్దామని అనుకునేవారికి.. తనను పొట్టన పెట్టుకుందామని చూసే వారికి తాను చెబుతున్నానని.. తనను ఎవరూ ఏమీ చేయలేరన్నారు. ఎవరికీ తాను భయపడే ప్రసక్తే లేదన్న ఆయన.. రంగా కొడుకులా తాను జనంలో ఉంటానని చెప్పారు. తనకు హాని చేయాలని రెక్కీ చేసిన వ్యక్తులు ఎవరనేది త్వరలోనే తెలుస్తుందని మరింత ఉత్కంటను పెంచేశారు. తాను చెప్పింది నిజమో కాదో కూడా తెలుస్తుందన్న మాటను చెప్పటం ద్వారా.. ఆయన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

ఒకవైపు తనను చంపటానికి ప్లానింగ్ చేస్తున్నారన్న వంగవీటి రాధా.. మరోవైపు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీకి బద్ధ శత్రువులుగా వ్యవహరిస్తున్న వల్లభనేని వంశీ.. కొడాలి నానితో భేటీ కావటం గమనార్హం. ఇదిలా ఉంటే.. వంగవీటి రాధా గురించి మాట్లాడుతూ.. రాధా తనకు తమ్ముడు లాంటివాడన్నారు. మొత్తంగా క్రిష్ణా జిల్లా రాజకీయాలు తాజా పరిణామంతో ఒక్కసారిగా అందరూ మాట్లాడుకునేలా మారిందని చెప్పక తప్పదు.