Begin typing your search above and press return to search.

విశాఖలో వంగవీటి వర్ధంతి...కాపుల చుట్టూ పాలిటిక్స్...?

By:  Tupaki Desk   |   23 Dec 2022 1:30 AM GMT
విశాఖలో వంగవీటి వర్ధంతి...కాపుల చుట్టూ పాలిటిక్స్...?
X
విశాఖలో పెద్ద ఎత్తున కాపునాడు సభ ఈ నెల 26న జరగనుంది. వంగవీటి మోహన రంగా 34వ వర్ధంతి సభను విశాఖ అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. రంగా అంటే అందరివాడుగా విజయవాడలో నిలిచారు. అయితే ఆయన్ని కాపులు తమ సొంతం చేసుకున్నారు. రంగా 1988 డిసెంబర్ 26న దారుణ హత్యకు గురి అయ్యారు. అప్పుడు అధికారంలో ఉనంది తెలుగుదేశం పార్టీ. దాంతో పాటు రంగాతో ఆనాడు పోటీగా ఉన్న వారు తెలుగుదేశంలో ఉండడంతో పాటు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే దారుణ హత్యకు గురి అవడానికి సర్కార్ అసమర్ధత కారణం అంటూ కాపులు మొత్తం ఆగ్రహించారు. ఫలితంగా 1989లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం ఓడింది.

రంగా మరణం తరువాత చూస్తే ఇప్పటికి ఏడుసారు శాసనసభకు ఎన్నికలు జరిగాయి. ఎపుడు ఎన్నికలు జరిగినా రంగా పేరు మాత్రం స్పష్టంగా వినిపిస్తుంది. ఆయన మావాడు అంటే మా వాడు అంటూ అన్ని రాజకీయ పార్టీలు క్లెయిం చేసుకోవడానికి చూస్తారు. నిజానికి రంగా మరణించేనాటికి కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఇపుడు కాంగ్రెస్ ఏపీలో నామమాత్రం అయింది. దాంతో ఆ పార్టీకి మరో రూపంగా ఉన్న వైసీపీ రంగా మావాడు అంటోంది.

రంగాను తెలుగుదేశం పార్టీయే హత్య చేయించింది అని వైసీపీ కాపు ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ఆ విధంగా రంగాను టీడీపీ నుంచి దూరం చేస్తే తమకు అనుకూలం అవుతుంది అని వారి ఆలోచన. అయితే ఏపీలో తెలుగుదేశం మాత్రమే లేదు జనసేన కూడా ఉంది. జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఎంత కులం లేదు అని అంటున్నా ఆయనను కాపులు తమ వాడే అంటారు. ఆ మాటకు వస్తే రంగా అన్ని వర్గాల కోసం పనిచేసినా కాపులు తమ వాడే అని ఆరాధిస్తున్నపుడు పవన్ కళ్యాణ్ వర్తమాన రాజకీయాల్లో ఉన్నారు అందువల్ల ఆయనను కూడా సొంతం అనుకునే జనసేన చుట్టూ అభిమానం పెంచుకుంటున్నారు

ఇవన్నీ పక్కన పెడితే రంగాకు రాజకీయ వారసుడు ఉన్నారు. ఆయన వంగవీటి రాధాక్రిష్ణ. ఆయన ఇపుడు టీడీపీలో ఉన్నారు. ఆయన కూడా కాంగ్రెస్ నుంచి రాజకీయ అరంగేట్రం చేసినా తరువాత కాలంలో ప్రజారాజ్యం అటు నుంచి వైసీపీ ద్వారా వచ్చి ఇపుడు టీడీపీ లో ఉన్నారు. ఎన్నికల వేళకు ఆయన జనసేనకు మారవచ్చు అని అంటున్నారు. అయితే ఏపీలో కుల సమీకరణలు ఎన్నికల్లో పెద్ద పాత్ర పోషిస్తున్న నేపధ్యంలో రాధాను తమ వైపునకు తిప్పుకునేందుకు వైసీపీ ప్రయత్నం గట్టిగానే చేస్తోంది.

మరో వైపు తెలుగుదేశం రంగాను హత్య చేయించింది అన్న ఆరోపణలు పదే పదే చేయడం వెనక కూడా ఇదే వ్యూహం ఉంది. అయితే తెలుగుదేశంలోనే రాధా ఉండాల్సిన అవసరం లేకపోతే జనసేన కూడా ఉంది. ఈ మధ్యనే నాదెండ్ల మనోహర్ ఆయనను కలసి చర్చలు కూడా జరిపారు. ఈ నేపధ్యంలో ఈ నెల 26న విశాఖలో జరిగే కాపునాడు సభకు రాధా వస్తున్నారని అంటున్నారు. అలాగే కాపు ప్రతినిధులు నాయకులు అంతా కూడా అటెండ్ అవుతున్నారు. వైసీపీ నుంచి తప్ప అన్ని పార్టీల నుంచి నాయకులు వస్తారని అంటున్నారు.

ఈ సమావేశం కాపునాడు ఆద్వర్యంలో జరుగుతోంది. రంగా వర్ధంతి వేళ ఆయన్ని తలచుకోవడానికే అని చెబుతున్నా రాజకీయ అంశాలు లేకుండా సభ అయితే జరగదు, వంగవీటి రంగా సాక్షిగా ఈ సభ ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటుంది అన్నది ఇపుడు ఆసక్తికరమైన చర్చగా ఉంది. కాపులకు రాజ్యాధికారం కావాలని ఒక వైపు నినాదాలు గట్టిగా వినిపిస్తున్న నేపధ్యంలో జరుగుతున్న సభ ఇది.

అలాగే ఏపీలో జనసేన రూపంలో తమకు ఒక రాజకీయ వేదిక ఉందని కాపులు భావిస్తున్న సనర్భంలో కాపునాడు సభ నిర్వహిస్తున్నారు. ఈ సభ ద్వారా సంచలన నిర్ణయాలే వస్తాయని అంటున్నారు. రాధా ఈ సభలో స్పెషల్ అట్రాక్షన్ అవుతారని, ఆయన రంగా కుమారుడిగా తీసుకునే నిర్ణయం, ఆయన వేసే అడుగుల బట్టి కాపుల ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుస్తుంది అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.