Begin typing your search above and press return to search.

భర్తపై కేసు పెట్టిన ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   18 July 2015 11:21 AM GMT
భర్తపై కేసు పెట్టిన ఎమ్మెల్యే
X
విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు... అయితే ఈసారి ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయంలో పోలీసులను ఆశ్రయించారు. గత ఏడాది మూడుసార్లు పోలీసు కేసులను ఎదుర్కొన్న ఈ తెదేపా ఎమ్మెల్యే తాజాగా తన భర్తపై కేసు నమోదు చేశారు. కొద్దికాలంగా అనిత భర్త నుంచి వేరుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఆమె ఇంట్లోలేని సమయంలో భర్త వచ్చి ఆస్తి పత్రాలు ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారని... ఇద్దరు పిల్లలపైనా దౌర్జన్యం చేశారని... అడ్డొచ్చినవారిని కొట్టబోయారంటూ ఆమె ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు. కాగా పదిహేనేళ్ల కిందట అనిత అదే పోలీస్ స్టేషన్లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇప్పుడు భర్త పై అదే స్టేషన్లో కేసు నమోదు చేశారు. కొద్దికాలంగా విభేదాల వల్ల భార్యాభర్తలిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. చాలాకాలంగా భరిస్తూ వస్తున్నానని... ఇక తనవల్ల కాకపోవడంతోనే భర్తపై కేసు పెట్టానని ఆమె చెబుతున్నారు.

కాగా అనిత గతంలోనూ పలుమార్లు పోలీసు స్టేషన్ మెట్లెక్కారు. గత ఏడాది డిసెంబరులో పాయకరావుపేటకు చెందిన రామారావు అనే ఉపాధ్యాయుడు అనితపై కేసు పెట్టారు. ఆమె తనను ఇంటికి పిలిపించి చెప్పుతో కొట్టారని, చంపేస్తానని బెదిరించారని ఆయన కేసు పెట్టారు. కాగా 2014లో ఆమె కార్లో వెళ్తుండగా మోటార్ సైక్లిస్టును వెనుకనుంచి ఢీకొనడంతో కేసు నమోదైంది. ఇంకోసారి పాయకరావు పేట పోలీసు స్టేషన్లో ఉన్న తన అనుచరులను విడిపించడానికి స్టేషన్ కు వెళ్లి హడావుడి చేయడంతో ఆమెపై పోలీసులు కేసు పెట్టారు.

స్థానికంగా ఇసుక మాఫియాకు అండదండలు అందిస్తున్నారని... ఇసుక మాఫియాను నడిపిస్తున్నారని కూడా ఆమెపై గతంలో ఆరోపణలు వచ్చాయి. తరచూ వివాదాలతో పోలీసు స్టేషన్ కు వెళ్లే ఆమె ఈసారి కుటుంబకలహాలతో స్టేషన్ మెట్లెక్కారు.