Begin typing your search above and press return to search.

విజయవాడ - విశాఖ ఇక నాలుగు గంటలే!

By:  Tupaki Desk   |   25 Nov 2022 5:30 AM GMT
విజయవాడ - విశాఖ ఇక నాలుగు గంటలే!
X
సూపర్‌ స్పీడ్‌లో బుల్లెట్‌లా దూసుకెళ్తూ.. నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ నగరాల మధ్య అత్యాధునిక హైస్పీడ్‌ రైళ్లను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. వందే భారత్‌ పేరుతో రూపొందిన ఈ రైళ్లు పలు నగరాల మధ్య ఇప్పటికే మొదలయ్యాయి.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం- విజయవాడ మధ్య వందే భారత్‌ రైళ్లను ప్రవేశపెట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో విశాఖ-విజయవాడ మధ్య వందే భారత్‌ రైలును ప్రవేశపెట్టనున్నారు. దీంతో విశాఖపట్నం నుంచి విజయవాడకు కేవలం నాలుగు గంటల్లోనే చేరుకునే అవకాశం ఉంటుంది. తద్వారా ఉత్తరాంధ్ర నుంచి కోస్తాంధ్రకు శరవేగంగా చేరుకోవచ్చు.

ప్రస్తుతం విశాఖపట్నం నుంచి విజయవాడకు ప్రస్తుతం రైలు ప్రయాణానికి 6 గంటలకు పైగా సమయం పడుతుండగా.. వందేభారత్‌ రైలు రాకతో కేవలం 4 గంటల్లోనే విజయవాడ చేరుకునే వీలుంది.

ప్రస్తుతం వివిధ నగరాల మధ్య వందే భారత్‌కు నిర్దేశించిన ధరల ప్రకారం చూస్తే విశాఖ నుంచి విజయవాడకు చైర్‌కార్‌లో దాదాపు రూ.850, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌లో రూ.1,600 నుంచి రూ.1,650 వరకూ చార్జీలు ఉండే అవకాశముందని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో విశాఖ నుంచి విజయవాడకు దాదాపు 2 గంటల ప్రయాణాన్ని తగ్గించేలా ట్రాక్‌ పరిశీలనల్లో వాల్తేరు రైల్వే డివిజన్‌ అధికారులు ఉన్నారు. ఇప్పటికే వాల్తేరు రైల్వే డివిజన్‌కు వందేభారత్‌ రేక్‌ కేటాయించినట్టు రైల్వే బోర్డు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో అధికారులు వందే భారత్‌ రైలుకు ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నారు.

కాగా ప్రస్తుతం మనదేశంలో నడుస్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు గంటకు 80 కి.మీ. గరిష్ట వేగంతో నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే వందే భారత్‌ రైళ్లు గంటకు 160 కి.మీ. వేగంతో పరుగులు పెడతాయి.

ప్రస్తుతం నడుస్తున్న ఎక్స్‌ప్రెస్, సూపర్‌ ఫాస్ట్‌ రైళ్ల కంటే రెట్టింపు వేగంతో వందే భారత్‌ దూసుకుపోతుంది కాబట్టి ట్రాక్‌ పటిష్టత, సామర్థ్యంపై అధికారులు దృష్టి సారించారు. విశాఖపట్నం-తిరుపతి మధ్య నడిచే డబుల్‌ డెక్కర్‌ రైలుని పరిశీలన కోసం వినియోగించారు.

కాగా వందే భారత్‌ రైలులో ఎన్నో సదుపాయాలు, సౌకర్యాలు ఉంటాయి. ఎమర్జెన్సీ లైటింగ్‌ వ్యవస్థ ఉంటుంది. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడినా ఇబ్బంది లేకుండా ఈ లైట్లు వెలుగుతాయి. అన్ని కోచ్‌లు పూర్తిగా ఏసీ సదుపాయంతో ఉంటాయి.

ప్రతి కోచ్‌లో 32 అంగుళాల స్క్రీన్‌తో ప్రయాణికులకు సమాచారాన్ని అందించే వ్యవస్థ ఉంటుంది. అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేసిన అగ్నిమాపక పరికరాలు ఉంటాయి. ఇవి కొద్దిపాటి పొగను కూడా వెంటనే పసిగట్టి ప్రయాణికు­లను అప్రమత్తం చేస్తాయి. వందేభారత్‌ రైలులో చైర్‌కార్, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ కోచ్‌లు ఉంటాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.