Begin typing your search above and press return to search.

ఇక్క‌డ‌ ఎన్టీఆరే ఓడిపోయాడు..కేటీఆరో లెక్కా!

By:  Tupaki Desk   |   8 Nov 2017 11:51 AM GMT
ఇక్క‌డ‌ ఎన్టీఆరే ఓడిపోయాడు..కేటీఆరో లెక్కా!
X
స‌వాళ్లు - ప్ర‌తిస‌వాళ్లు విస‌ర‌డంలో తెలంగాణ సీఎం కేసీఆర్ త‌ర్వాత ఆయ‌న త‌న‌యుడు - మంత్రి కేటీఆర్ ముందు వ‌రుస‌లో ఉంటారు. టీఆర్ ఎస్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత చేసిన అభివృద్ధి గురించి - గ‌తంలో కాంగ్రెస్ హ‌యాంలో తెలంగాణ‌కు జ‌రిగిన అన్యాయం గురించి కాంగ్రెస్ నాయ‌కుల‌తో పోటీకి సై అంటారు. అయితే ఇప్పుడు ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి.. కేటీఆర్‌ కు స‌వాలు విసిరారు! కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు కూడా విమ‌ర్శ‌లు - స‌వాళ్లు చేసే విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తుంటారు. ఈ నేప‌థ్యంలో వంశీ చంద్ రెడ్డి ఏ ధైర్యంతో కేటీఆర్‌ ను పోటీకి ఆహ్వానించాడోన‌నే చ‌ర్చ ఇప్పుడు మొద‌లైంది.

టీఆర్ ఎస్ ప్ర‌భుత్వంపై కాంగ్రెస్ నేత‌లు మాట‌ల దాడి పెంచుతున్నారు. ముఖ్యంగా కేసీఆర్ కుటుంబ పాల‌న‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. కేసీఆర్ కుటుంబ స‌భ్యులే దందాల‌కు పాల్ప‌డుతున్నారంటూ ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి టీఆర్ ఎస్‌ లో చేరిన‌ ఫిరాయింపు ఎమ్మెల్యేల‌తో రాజీనామాలు చేయించాల‌నే డిమాండ్లు అధిక‌మ‌వుతున్నాయి. కీల‌క‌మైన అసెంబ్లీ స‌మావేశాలు జ‌ర‌గుతున్న స‌మ‌యంలో ఈ అంశాలపై ఎక్కువ‌గా దృష్టిపెడుతున్నారు. అయితే ఇప్పుడు కేటీఆర్‌ ను ఉద్దేశించి కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్య‌లు హాట్ టాపిక్‌ గా మారాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేలు కారు గుర్తుపై పోటీ చేసి గెల‌వాల‌ని వంశీచంద్‌ రెడ్డి డిమాండ్ చేశారు.

కేసీఆర్ దళితుడిని సీఎం చేస్తా అన్నాడు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు.. ఏం అయిందో చెప్పాలని వంశీచంద్‌ రెడ్డి డిమాండ్ చేశారు. `మీరు, మీ కుటుంబంలోని కొంతమంది బంధువులు 123 జీవో ప్ర‌కారం ఫార్మాసిటీ పేరుతో భూములు లాక్కున్నార‌ని అన్నారు. సిరిసిల్లలో మీ బంధువులు అక్రమంగా భూ సేకరణ చేస్తున్నారు. 2013 చట్టం ప్రకారం భూమిని సేకరించకుండా పేదలను మోసం చేస్తున్న మీ బంధువుల పైన సీఐడీ ఎంక్వయిరీ వేయించాల`ని వంశీచంద్‌ రెడ్డి డిమాండ్ చేశారు. ఇందులో అక్రమాలు బయట పడతాయంటూ విమ‌ర్శించారు. `ఇప్పుడు అసెంబ్లీ నడుస్తోంది. ఫార్మా సిటీ కావాల‌ని మేడిపల్లి ప్రజలు అంటే నేను ముక్కు నేలకు రాస్తాను` అని అన్నారు.

`మా నియోజకవర్గంలో ఒరిజినల్ తారక రామారావే ఓడిపోయారు. ఈ డూప్లికేట్ తారకరామారావు మా కల్వకుర్తి ప్రజలకు ఓ లెక్కా` అంటూ కేటీఆర్‌ నుద్దేశించి వంశీచంద్‌ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు దమ్ముంటే కారు గుర్తుమీద గెలవాల‌ని స‌వాలు విసిరారు.