Begin typing your search above and press return to search.

ఉక్కు లెక్కలు కట్టేస్తున్నారు...?

By:  Tupaki Desk   |   12 Nov 2021 6:34 AM GMT
ఉక్కు లెక్కలు కట్టేస్తున్నారు...?
X
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదాలు విశాఖ గంభీర సాగరంలో అలా ఉండిపోతున్నాయి. యాభై ఏళ్ళ క్రితం ఉవ్వెత్తుల లేచిన ఉద్యమ కెరటాల ధాటి ఇంకా తగ్గలేదు. మరో వైపు చూస్తే విశాఖ ఉక్కు మూడు దశాబ్దాల క్రితం ప్రారంభించిన ఉత్పత్తి ముచ్చట్లు ఇంకా తీరలేదు.

ఇంతలోనే నూరేళ్ళూ నిండిపోతున్నాయి. విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయాలన్నది కేంద్ర ప్రభుత్వం ఉక్కు సంకల్పం. ఈ విషయంలో అడ్డుకోవడానికి ఎవరూ లేరనే చెప్పాలేమో. చేస్తున్న పోరాటాల‌లో గత కాలం వేడి లేనేలేదు. ఇక రాజకీయ నాయకత్వం కడు బలహీనంగా ఉందనే విమర్శలు వచ్చి పడుతున్నాయి.

మరి ఇపుడు కాకపోతే మరెప్పుడు అని ఉక్కు విషయంలో కేంద్రం అనుకుంటే తప్పు వారిది కాదేమో. అందుకే ఉక్కు ప్రైవేటీకరణ పనులు దూకుడుగా సాగుతున్నాయి. విశాఖ ఉక్కు నిజ విలువ ఎంతో లెక్క కట్టేందుకు వాల్యుయేషన్ కమిటీ విశాఖ ఉక్కుకు రాబోతోంది.

వారితో పాటే అడ్వైజరీ కమిటీ కూడా ఉక్కుని సందర్శించాలనుకుంటోంది. ఈ కమిటీలు ఇచ్చే నివేదికలు ఏంటి అన్న ఆసక్తి అయితే ఉంది. నిజానికి విశాఖ ఉక్కు విలువ లక్షల కోట్ల మాటే అంటున్నారు. అయితే దాన్ని వేలల్లోనే కడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.

విశాఖ ఉక్కు పాతిక వేల ఎకరాలలో ఉంది. ఇందులో కర్మాగారానికి వినియోగించగా మిగిలిన పద్దెమింది ఎకరాల విలువే వందల కోట్లలో ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. దానికి తోడు సీ షోర్ ప్లాంట్ గా దేశంలోనే రికార్డు సాధించింది. చవక అయిన రవాణా సదుపాయాలతో సహా అన్నీ అందుబాటులో ఉన్న విశాఖ ఉక్కు అంటే ఎవరికైనా ఎక్కువే.

అలాంటి ఉక్కుని ప్రైవేటీకరిస్తే తీసుకొనేందుకు ఎందరో బిగ్ షాట్స్ రెడీగా ఉన్నారు. టాటా స్టీల్ యాజమాన్యం అయితే విశాఖ స్టీల్ మీద తన మక్కువను గట్టిగానే చాటుకుంది. మరో వైపు అదానీ ఉండనే ఉన్నారు. వీరు కాక చాలా మంది పెద్దలు ఉక్కు విషయంలో ఆసక్తిని కనబరుస్తున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయవద్దు అంటూ ఉద్యమ కర్యాచరణ కమిటీ అయితే గట్టిగానే పోరాడుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రం నియమించిన కమిటీ ప్రతినిధులను విశాఖ ఉక్కు గేటు కూడా తాకనివ్వమని ఉద్యమ కారులు అంటున్నారు. మరో వైపు కోటి సంతకాల సేకరణ కూడా ఉక్కు ప్రైవేట్ నకు వ్యతిరేకంగా సాగుతున్నాయి.

మొత్తానికి ప్రజాల మద్దతుతోనే తాము ఉక్కుని పరిరక్షించుకుంటామని ఉద్యమ కారులు చెబుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ వంటి వారు వైసీపీ సర్కార్ ని అఖిల పక్షం వేయమంటే పవనే ఢిల్లీ వెళ్ళి తమ మిత్ర పక్షం బీజేపీని ఈ విషయంలో ఒప్పించాలని వైసీపీ నాయకులు అంటున్నారు. ఈ విషయంలో ఏపీ లోని రాజకీయ పార్టీలు అంతా ఒక్క త్రాటి మీదకు రాలేవు అన్న సంగతి తేలిపోతోంది. దాంతో ఉక్కు విషయంలో ఏం జరుగుతుంది అన్న ఆతృత అయితే అందరిలో ఉంది. చూడాలి మరి