Begin typing your search above and press return to search.

వంశీకి అసలు మ్యాటర్‌ అర్థమైందా?

By:  Tupaki Desk   |   15 Feb 2016 6:53 AM GMT
వంశీకి అసలు మ్యాటర్‌ అర్థమైందా?
X
ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం కొన్ని విషయాల్లో సమన్యాయం పాటిస్తోంది. చేసిన పని నచ్చకపోతే ప్రతిపక్ష నేతలైనా, సొంత పార్టీ ఎమ్మెల్యేలైనా ఎవరిపైనైనా కేసులు పెడుతోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించి ప్రజాపక్షాన నిలిస్తే సొంత ఎమ్మెల్యేలనైనా జైలుకు పంపిస్తానంటోది. తాజాగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదు కావడంతో టీడీపీ నేతల్లో ఇలాంటి చర్చే జరుగుతోంది. అయితే... గతంలో మహిళా అధికారులను కొట్టిన, అంగన్ వాడీ కార్యకర్తలను తిట్టిన చింతమనేని ప్రభాకర్ వంటివారిపై మాత్రం కేసులు పెట్టలేదు అంటున్నారు.

విజయవాడలో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం కోసం రామవరప్పాడులో నేషనల్ హైవే వెంబడి ఇళ్లను కూల్చేందుకు అధికారులు ప్రయత్నించగా స్థానికులు ఆందోళనకు దిగారు. రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వంశీ అక్కడికి వెళ్లి వారితో చర్చలు జరిపే ప్రయత్నం చేశారు. స్థానికుల ఆవేదనలో అర్థముందని భావించిన వంశీ వారికి మద్దతు ప్రకటించారు. నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన అధికారులు వెనక్కు వెళ్లాలని అప్పటి వరకు స్థానికులు ఆందోళన విరమించే పరిస్థితి లేదని ఎమ్మెల్యే పోలీసులతో చెప్పారు. దీంతో రెవెన్యూ అధికారులు వెనుదిరిగారు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన వంశీ అధికారుల పనులకు ఆటంకం కలిగించారంటూ కేసులు నమోదుచేశారు. దీంతో వంశీ ఒకింత షాక్ అయ్యారు . స్థానికులతో చర్చించి సమస్యను పరిష్కరించేందుకు వస్తే తనపైనే కేసులు పెడుతారా అని మండిపడ్డారు. పోలీసుల తీరుకు నిరసనగా తన గన్‌ మెన్లను వెనక్కు పంపారు.

అయితే వంశీపై కేసు నమోదుపై ఆయన అనుచరులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకే చెందిన కొందరు పెద్దలు కావాలనే వంశీపై కేసులు పెట్టించారని మండిపడుతున్నారు. తొలి నుంచి కూడా కొందరు జిల్లా టీడీపీ పెద్దలకు వంశీ మధ్య ఉన్న విభేదాలను గుర్తు చేస్తున్నారు. పైగా వల్లభనేని వంశీ… హరికృష్ణ - జూనియర్ ఎన్టీఆర్ లకు సన్నిహితుడి పేరుంది. ఎమ్మెల్యే చింతమేని ప్రభాకర్ ఏకంగా మహిళ తహసీల్దార్ వనజాక్షిని ఇసుక రేవులో పడేసి కొట్టినా కేసులు పెట్టని పోలీసులు ప్రజల పక్షాన నిలిచిన వంశీపై మాత్రం కేసులు నమోదు చేశారంటే దీని వెనుక కొన్ని శక్తులు హస్తముందని ఆరోపిస్తున్నారు.