Begin typing your search above and press return to search.

వాజ్‌ పేయి - అద్వానీ బీజేపీ కాదా? ఇప్పుడున్న‌ది గుజ‌రాత్ బీజేపీనా?

By:  Tupaki Desk   |   24 March 2021 2:30 PM GMT
వాజ్‌ పేయి - అద్వానీ బీజేపీ కాదా? ఇప్పుడున్న‌ది గుజ‌రాత్ బీజేపీనా?
X
దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం ఉన్న బీజేపీ పార్టీ, ఆపార్టీ నాయ‌కుల అంశం.. తీవ్ర చ‌ర్చ‌కు దారితీస్తోంది. గ‌తంలో అనేక మంది సీనియ‌ర్లు.. బీజేపీ ఉన్నా... ఇప్పుడున్న విధంగా దేశంలో ప‌రిస్థితి లేక‌పోవ‌డం.. ఇప్పుడు మాత్రం ఒక విధ‌మైన వ్య‌వ‌స్థ‌గా బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తుండ‌డంతో ఇప్పుడున్న బీజేపీ ప‌రిస్థితి ఏంటి? అనే అంశం ఆస‌క్తిక‌రంగా మారింది. కొంచెం మూలాల్లోకి వెళ్తే.. దేశానికి స్వాతంత్య్రం తెచ్చామ‌ని చెప్పుకొనే కాంగ్రెస్‌తో అనేక సంవత్స‌రాలు.. అనేక రూపాల్లో ఆర్ ఎస్ ఎస్, జ‌నతా పార్టీలు పోరాటం చేశాయి. ఈ క్ర‌మంలో పుట్టిందే.. బీజేపీ. కేవలం రెండు స్థానాల‌తో ప్ర‌స్థానం ప్రారంభించిన బీజేపీ.. ఈ రోజు.. పూర్తిస్థాయి మెజారిటీతో కేంద్రంలో వ‌రుస‌గా చ‌క్రం తిప్పే ప‌రిస్థితికి చేరుకుంది.

అయితే.. గ‌త బీజేపీకి, ప్ర‌స్తుత బీజేపీకి చాలా వ్య‌త్సాసం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అప్ప‌ట్లో వాజ్‌పేయి, అద్వానీ వంటివారు కాంగ్రెస్ పై పోరాటాలు చేసినా.. విలువ‌లు, విశ్వ‌స‌నీయ‌త‌తో కూడిన బీజేపీని తీర్చిదిద్దారు. ఈ క్ర‌మంలో అద్వానీ, వాజ్‌పేయి వంటివారిని చూసి.. అనేక మంది కాంగ్రెస్ ను వీడి బీజేపీలోకి చేరిన సంద‌ర్భాలు ఉన్నాయి. అంతేకాదు.. మేధావులు సైతం బీజేపీలోకి వ‌చ్చారు. ఇలా.. అంచెలంచెలుగా ఎదిగిన బీజేపీ... అనేక ఆటు పోట్లు చ‌విచూసింది. అయినా.. నిల‌దొక్క‌కుని `విశ్వ‌స‌నీయ‌త‌` అనే జీవ‌నాడిని విడిచి పెట్టుకుండా ప్ర‌జ‌ల‌కు చేరువైంది.

ఈ సంద‌ర్భంగా గ‌తంలో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న చూస్తే.. అప్ప‌టి వాజ్‌పేయి ప్ర‌భుత్వం 13 రోజుల పాల‌న‌కే పార్ల‌మెంటులో విశ్వాస ప‌రీక్ష‌ను ఎదుర్కొని ఒకే ఒక్క ఓటు తేడాతో ఓడిపోయింది. అయిన‌ప్ప‌టికీ.. ఈ ఓట‌మిని అప్ప‌టి వాజ్‌పేయి మ‌న‌స్పూర్తిగా అంగీక‌రించారు.. వెంట‌నే ఎన్నిక‌ల‌కు వెళ్లారు. ఈవిశ్వ‌స‌నీయ‌త‌, విలువ‌ల‌తో కూడిన వాజ్ పేయి రాజ‌కీయం.. దేశ ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించింది. ఈ క్ర‌మంలోనే త‌దుప‌రి ఎన్నికల్లో బీజేపీకి ప్ర‌జ‌లు సంపూర్ణ మ‌ద్ద‌తు క‌ట్ట‌బెట్టారు. అలాంటి బీజేపీ.. ఇప్పుడు కార్పొరేట్ మాయ‌లో ప‌డి.. కార్పొరేట్ల‌కింద న‌లిగిపోతోంద‌న‌ని మేధావులే ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

వాస్త‌వానికి దేశ ‌రాజ్యంగం ప్ర‌కారం మ‌న‌దో సోష‌లిస్ట్ దేశం. కానీ, ఈ రోజు మోడీ, అమిత్ షా వ‌చ్చిన త‌ర్వాత‌.. క్యాపిట‌లిస్ట్ ల దేశంగా మారిపోయింద‌నే భావన వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి ఇలా మార్చ‌డం అనేది వారికి ఎవ‌రు ఇచ్చిన హ‌క్కు? ఇదే ఇప్పుడు మేధావులు సైతం ప్ర‌శ్నిస్తున్నారు. ఇండియా అంటే మోడీ, అమిత్ షా, అంబానీ, అదానీ కాదు.. అని చెబుతున్నారు. ఒక‌ప్ప‌టి బీజేపీకి ఇప్ప‌టి బీజేపీకి తేడా.. ఏంటంటే.. అప్ప‌టి పార్టీ.. `భార‌తీయ‌` జ‌న‌తా పార్టీ అయితే... ఇప్పుడు మాత్రం గుజ‌రాత్ జ‌న‌తా పార్టీ అన్న‌విధంగా మారింద‌నే విమ‌ర్శ‌లు ముసురుతున్నాయి. ఈ విమ‌ర్శ‌లు ఎవ‌రో బ‌య‌టి వారు చేయ‌డం లేదు.. సొంత పార్టీ సీనియ‌ర్లే చెవులు కొరుక్కుంటున్నారు.

ఇక‌.. ఇప్పుడున్న ప‌రిస్థితిలో బీజేపీ అధికార ప్ర‌తినిధులు ఎవ‌రూ కూడా మీడియా చ‌ర్చ‌ల్లో పాల్గొనే ప‌రిస్థితి లేకుండా పోయింది. అస‌లు చ‌ర్చ అంటే.. భ‌య‌ప‌డిపోయే ప‌రిస్థితి వ‌చ్చింది.. ఇదంతా మోడీ, అమిత్ షాలే తీసుకువ‌చ్చార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. వాస్త‌వానికి ఒక‌ప్పుడు బీజేపీ ప్ర‌తినిధులు వ‌స్తున్నారంటే.. ఆ చ‌ర్చ‌లు ఫ‌ల‌వంతంగా ఉంటాయ‌ని, మంచి స‌బ్జెక్టుతో వ‌స్తార‌ని అంద‌రూ అనుకునేవారు. కానీ, ఇప్పుడు ప‌రిస్థితి అలా లేదు.. నోరు విప్పితే అబ‌ద్ధాలు చెప్పాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌ని.. బీజేపీ సీనియ‌ర్లే చెవులు కొరుక్కుంటున్నారు.. మ‌రి ఇదే ప‌రిస్థితి ఉంటే.. ప్ర‌జ‌ల‌కు ఏం మేలు చేసిన‌ట్టు? కాబ‌ట్టి.. ఇప్ప‌టికైనా.. ప్ర‌జ‌లకు మేలు చేసే ప‌నులు చేప‌ట్టండి మోడీజీ అంటున్నారు.. దేశ‌వ్యాప్త మేధావి వ‌ర్గం!! మ‌రి మార‌తారా? ప్ర‌జ‌ల‌నే ఏమారుస్తారా? అనేది చూడాలి.