Begin typing your search above and press return to search.

పీరియడ్స్ సమయంలో వ్యాక్సినేషన్.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం!

By:  Tupaki Desk   |   26 April 2021 9:30 AM GMT
పీరియడ్స్ సమయంలో వ్యాక్సినేషన్.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం!
X
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి కోరలు చాస్తున్న వేళ... వైరస్ ను కట్టడి చేయడానికి వివిధ దేశాల ప్రభుత్వాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకు యుద్ధప్రాతిపదికన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాయి. మనదేశంలోనూ టీకా పంపిణీ కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ పై ఎన్నో రకాలు పుకార్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. టీకా తీసుకోవడం, ప్లాస్మా ఇవ్వడం వంటి వాటిపై రకరకాల రూమర్లు ప్రచారం అవుతున్నాయి. వీటన్నింటికి ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో స్పష్టతనిచ్చారు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న అసత్య వార్తలను ప్రజలను నమ్మవద్దని ఆయన సూచించారు. పుకార్లు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంటి వైద్యం పేరిట అల్లం, మిరియాలు, తేనె కలిపి రోజు తీసుకుంటే కరోనా దరి చేరదనే సందేశాలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. దీనిని డబ్ల్యూహెచ్వో ఆమోదించిందని పాండిచ్చేరి యూనివర్సిటీ విద్యార్థి పేరు మీద సర్క్యులేట్‌ అయింది. ఇది అవాస్తవమని మోదీ స్పష్టం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పుడూ ఇలాంటి ప్రకటన చేయలేదని వెల్లడించారు.

మహిళలు రుతుస్రావం సమయంలో వ్యాక్సిన్ తీసుకోకూడదని వాట్సాప్ లో ఓ సందేశం వైరల్ గా మారింది. పీరియడ్స్ కు ముందు, తర్వాత ఐదు రోజుల వరకు టీకా తీసుకోకూడదు, ఆ సమయంలో రోగ నిరోధకత తక్కువగా ఉంటుందని ఆ సందేశంలో పేర్కొన్నారు. ఇది పూర్తిగా అవాస్తమని ప్రధాని తేల్చారు. రుతుస్రావానికి వ్యాక్సిన్ కి సంబంధం లేదని.. మహిళలు నిర్భయంగా టీకా తీసుకోవచ్చని సూచించారు.

రోజూ ఆవిరి పడితే కరోనా సోకదని బెంగుళూరులోని ఎయిర్‌ మార్షల్‌ అశుతోష్‌ శర్మ పేరిట ప్రచారం అయింది. బెంగుళూరులో ఆ పేరుతో ఎయిర్ మార్షల్ ఎవరూ లేరని ప్రధాని స్పష్టం చేశారు. వైస్‌ ఎయిర్‌ మార్షల్‌గా పనిచేస్తున్న అశుతోశ్‌ ఓ ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు కానీ ఆయన ఈ ప్రకటన చేయలేదని వెల్లడించారు. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.

వ్యాక్సిన్ తీసుకుంటే ప్లాస్మా ఇవ్వకూడదనే వార్తలపై మోదీ క్లారిటీ ఇచ్చారు. వ్యాక్సిన్‌ తీసుకున్నాక 28 రోజుల పాటు ప్లాస్మా ఇవ్వకూడదని చెప్పారు. గర్బవతులు ప్లాస్మా ఇవ్వకూడదు అని అన్నారు. వైరస్ నుంచి కోలుకున్న 14 రోజుల తర్వాతే ప్లాస్మా ఇవ్వాలని సూచించారు. ఇలా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న అసత్య వార్తలపై కేంద్రం స్పష్టతనిచ్చింది.