Begin typing your search above and press return to search.

మోడీకి ఇంకో షాక్:మ‌రో మిత్ర‌ప‌క్షం వార్నింగ్‌

By:  Tupaki Desk   |   8 April 2018 5:49 PM GMT
మోడీకి ఇంకో షాక్:మ‌రో మిత్ర‌ప‌క్షం వార్నింగ్‌
X
బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే మిత్రపక్షాల్లో లుక‌లుక‌లు మ‌రోమారు తెర‌మీద‌కు వ‌చ్చాయి. ఎన్డీఏ కూట‌మికి టీడీపీకి గుడ్ బై చెప్పేయ‌డం... ఇప్పటివకే శివసేన వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరుకు దిగుతామని ప్రకటించగా - తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుంటే కూటమిలో కొనసాగే అంశాన్ని పునరాలోచిస్తామని యూపీ మంత్రి - ఎస్బీఎస్పీ అధినేత ఓం ప్రకాశ్‌ రాజ్‌ భర్‌ తేల్చేశారు. తమను సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ‘సంకీర్ణ ధర్మం’ పాటించడం లేదని ఆదివారం మీడియాతో చెప్పారు. ఈ నెల 10న బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాతో లక్నోలో సమావేశమైన తర్వాత తమ భవిష్యత్‌ కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు.

త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే భేటీలో తాము లేవనెత్తే అంశాలను అమిత్‌ షా అంగీకరించకుంటే కూటమిలో కొనసాగే అంశాన్ని పునరాలోచిస్తామని ఉత్తరప్రదేశ్‌ లో క్యాబినెట్‌ మంత్రి - ఎస్బీఎస్పీ నాయకుడు ఓం ప్రకాశ్‌ రాజ్‌భర్ అన్నారు. యూపీ ప్రభుత్వంలో అగ్రవర్ణాలకే పెద్దపీట వేస్తున్నారని - ఎస్సీ - ఎస్టీ - బలహీన వర్గాలను పట్టించుకోవడం లేదని ఓం ప్రకాశ్‌ రాజ్‌ భర్‌ ఆరోపించారు. బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్‌ త్రిపాఠి స్పందిస్తూ ఓం ప్రకాశ్‌ రాజ్‌భర్‌ కేవలం మీడియా కోసమే బీజేపీపై ఆరోపణలు గుప్పించారని పేర్కొన్నారు.

ఇదిలాఉండ‌గా...మహారాష్ట్రలో మిత్రపక్షం శివసేన నాయకత్వానికి బీజేపీ మ‌ధ్య పొరాపొచ్చాలు స‌ర్దుబాటు అయ్యే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదంటున్నారు. వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయబోమని, ఒంటరి పోరుకు దిగుతామని శివసేన గత జనవరిలో ప్రకటించిన సంగతి తెలిసిందే. శివసేన సీనియర్‌ నేత సుభాష్‌ దేశాయి శనివారం రాత్రి ఠాణెలో జరిగిన సభలో మాట్లాడుతూ అకస్మాత్తుగా గత ఆరు నెలలుగా బీజేపీ స్వరం మారిందని, ఎన్డీఏ మిత్ర పక్షాల గురించి మాట్లాడుతున్నదన్నారు. ఉద్ధవ్‌ ఠాక్రే సారథ్యంలో శివసేన వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. మరో శివసేన నాయకుడు మాట్లాడుతూ బీజేపీ తన రాజకీయ లబ్ది కోసం మిత్రపక్షాలను వాడుకుని వదిలేస్తుందని ఆరోపించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినా తమ వ్యూహంలో మార్పు లేదని ఆ పార్టీ తేల్చి చెప్పింది. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలన్న వ్యూహంలో ఎటువంటి మార్పు లేదని ఆదివారం స్పష్టం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కలిసి పని చేస్తున్నా తరుచుగా కేంద్ర ప్రభుత్వ విధానాలను శివసేన ప్రశ్నిస్తోంది. ఈ నెల ఆరో తేదీన ముంబైలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా మీడియాతో మాట్లాడుతూ ఉద్ధవ్‌ ఠాక్రే సారథ్యంలోని శివసేన పార్టీ ఎన్డీయేలోనే కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘వారు (శివసేన) ప్రస్తుతం మాతో ప్రభుత్వంలో కలిసి ఉన్నారు. వారు మాతో కలిసి ఉండాలన్నది మా బలమైన ఆకాంక్ష’ అని వ్యాఖ్యానించారు