Begin typing your search above and press return to search.

కేసీఆర్ పాల‌న‌లో అన్ని దారుణాల‌ట‌!

By:  Tupaki Desk   |   4 April 2018 5:28 AM GMT
కేసీఆర్ పాల‌న‌లో అన్ని దారుణాల‌ట‌!
X
తెలంగాణ ఉద్య‌మ కాలంలో ఒక మాట చాలా త‌ర‌చూ వినిపించేది. దాదాపు 1500 మందికి పైగా యువ‌కులు తెలంగాణ కోసం ఆత్మ‌బ‌లిదానాలు చేసుకున్న‌ట్లుగా చెప్పేవారు. ఇన్ని వేల మంది ప్రాణాలు తీస్తున్నారు.. మీరు మ‌నుషులా? అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు తెలంగాణ వ్యాప్తంగా ప్ర‌తి గుండెను ర‌గిలించేలా చేసింది. తెలంగాణ ఉద్య‌మం పీక్స్ కు చేరుకోవ‌టానికి ఆత్మ‌బ‌లిదానాలు ఢిల్లీని సైతం వ‌ణికించాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డితే ఆత్మ‌బ‌లిదానాలు ఆగుతాయ‌ని..సీమాంధ్ర దుర్మార్గ పాల‌న‌కు అంతం ప‌లికి సొంతోళ్ల పాల‌న‌లో బంగారు తెలంగాణ ఏర్ప‌డుతుంద‌ని.. అక్క‌డ ఎలాంటి బ‌ల‌వ‌న్మ‌ర‌ణాలు ఉండ‌వ‌ని చెప్పేవారు. కేసీఆర్ కోరుకున్న‌ట్లే తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ‌ట‌మే కాదు.. ఆయ‌నే ముఖ్య‌మంత్రి అయ్యారు. కానీ.. కేసీఆర్ నాలుగేళ్ల పాల‌న‌లో తెలంగాణలో ఎలాంటి ప‌రిస్థితి నెల‌కొంద‌న్న విష‌యాన్ని పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు.

అబ‌ద్ధాల‌తో నాలుగేళ్ల పాటు కేసీఆర్ వృథా చేశార‌ని.. ఆయ‌న వైఫ‌ల్యం కార‌ణంగా నాలుగేళ్ల‌లో నాలుగువేల మంది రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నార‌న్నారు. ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న కుటుంబాల‌ను ముఖ్య‌మంత్రి.. మంత్రులు.. ఎమ్మెల్యేలు.. అధికారులు ప‌రామ‌ర్శించ‌క‌పోవ‌టం బాధాక‌ర‌మ‌న్న ఉత్త‌మ్‌.. ఎన్నిక‌ల వేళ‌లో కేసీఆర్ ఇచ్చిన ఏ హామీని నెర‌వేర్చ‌లేర‌న్నారు.

ఉత్త‌మ్ విమ‌ర్శ‌ల్లో అన్ని నిజాలు లేకున్నా.. అన్ని అబ‌ద్దాల‌ని కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి. కాకుంటే.. నాలుగేళ్ల కాలంలో నాలుగువేల మంది రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోవ‌టం మాత్రం షాకింగ్ గా మారింద‌ని చెప్పాలి. కేసీఆర్ స‌ర్కారు వైఫ‌ల్యాల్ని అసెంబ్లీలో ఎక్క‌డ నిల‌దీస్తామోన‌న్న భ‌యంతోనే త‌మ‌ను అసెంబ్లీ నుంచి బ‌య‌ట‌కు పంపార‌న్నారు. క‌మీష‌న్ల క‌క్కుర్తితోనే కాళేశ్వ‌రం ప్రాజెక్టు రీ డిజైన్ చేశార‌న్న ఉత్త‌మ్‌.. కేవ‌లం కాంట్రాక్ట‌ర్ల‌కు లాభం చేసేందుకు రూ.85 వేల కోట్ల‌కు అంచ‌నాలు పెంచిన‌ట్లుగా చెప్పారు. నిరుపేద‌ల భూములు బ‌ల‌వంతంగా లాగేసుకున్నార‌ని ఆరోపించారు.

ఉత్త‌మ్ ఆరోప‌ణ‌లు ఇలా ఉంటే.. జీవ‌న్‌ రెడ్డి మ‌రింత తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేశారు. స‌బ్సిడీ ట్రాక్ట‌ర్ల కొనుగోలులో రూ.300 కోట్ల అవినీతి జ‌రిగింద‌ని.. సీఎం కేసీఆర్ ను ఏ జైల్లో పెట్టాల‌ని ప్ర‌శ్నించారు. ఇక‌.. రేవంత్ మాట్లాడుతూ.. రాష్ట్రానికి గులాబీ చీడ ప‌ట్టుకుంద‌న్నారు. కేసీఆర్ స‌ర్కారు త‌ప్పుల్ని.. అన్యాయాల్ని ప్ర‌శ్నిస్తే త‌మ‌ను అడ్డుకుంటున్నార‌న్న మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌.. రానున్న రోజుల్లో కేసీఆర్ స‌ర్కారును నిల‌దీసే రోజులు ద‌గ్గ‌ర్లోనే ఉన్నాయ‌న్నారు.