Begin typing your search above and press return to search.

ప‌ద‌వికి రాజీనామా చేయ‌నున్న ఉత్త‌మ్

By:  Tupaki Desk   |   13 Dec 2015 10:06 AM GMT
ప‌ద‌వికి రాజీనామా చేయ‌నున్న ఉత్త‌మ్
X
తెలంగాణ రాష్ట్ర అవతరణలో ప్రధాన పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీకి ఇపుడు ఆ రాష్ట్రంలోనే నిలువ నీడ లేకుండా పోతోంది. రాష్ర్టం ఏర్ప‌డిన త‌ర్వాత‌ పార్టీకి జవసత్వాలు కల్పించేందుకు పొన్నాల లక్ష్మయ్యను తొలగించి ఉత్తమకుమార్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించిన లెక్క‌నే ఇపుడు ఉత్త‌మ్ విష‌యంలో అవ‌లంభించేందుకు కాంగ్రెస్ క‌స‌ర‌త్తు రెడీ చేసింద‌ని స‌మాచారం.

ఇటీవ‌ల జరిగిన వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక, తాజాగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పిదాలు పరాకాష్టకు చేరుకున్నాయని ఢిల్లీ అధిష్టానం భావిస్తోంది. వరంగల్ ఉప ఎన్నికల్లో అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేసే స‌మ‌యంలో అప్పటికే సిరిసిల్ల రాజయ్యపై అభియోగాలు ఉన్నా టీపీసీసీ అగ్ర‌నేత‌లు తేలిక‌గా వ్య‌వ‌హ‌రించారు. అనంత‌రం ఆయ‌న ఇంట్లో జ‌రిగిన ఘ‌ట‌న‌, రాజయ్య అరెస్టవ‌డం పార్టీ ప‌రువును బ‌జారున ప‌డేసింది. పోనీ ఫ‌లితాల సంగ‌తి చూద్దాం అనుకున్నా...కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు దక్కలేదు. మ‌రోవైపు ప్ర‌స్తుతం జ‌రుగుతున్న‌ స్ధానిక సంస్ధల్లో కాంగ్రెస్ పార్టీకి తగినంత బలం ఉన్నా 12 సీట్లకు అభ్యర్ధులను నిలబెట్టలేకపోయింది. ఐదు సీట్లకు పోటీచేసినా, ఇందులో ఇద్దరు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. వరంగల్ - కరీంనగర్ - ఆదిలాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్ధులు కరువయ్యారు. ఎందుకిలా అనే కాంగ్రెస్ పెద్ద‌ల ప్ర‌శ్న‌కు టీపీసీసీ నేతల నుంచి సరైన సమాధానం లభించలేద‌ని స‌మాచారం.

ప్రజలు ఎందుకు కాంగ్రెస్ పార్టీని ఆదరించడం లేదో కారణాలను తెలుసుకోవడంలో పార్టీ నాయకత్వం సరైన ప్రయత్నం చేయలేదని కాంగ్రెస్ పెద్ద‌లు విశ్లేషిస్తున్నారు. పార్టీ నేతలు పత్రికా విలేక‌ర్ల సమావేశాలకు పరిమితమయి ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో తమ పని ముగిసిందనుకుంటున్నారని వారి ద‌గ్గ‌ర ఫీడ్‌బ్యాక్ ఉంద‌ట‌. జనంతో, పార్టీ క్యాడర్‌ తో కాంగ్రెస్ నేతలకు సంబంధాలు క్షీణించాయని కాంగ్రెస్ నుంచి భారీ ఎత్తున టీఆర్‌ ఎస్‌ లోకి వలసలు ప్రారంభం కావ‌డంలో ఇదో కార‌ణ‌మ‌ని విశ్లేషిస్తున్నారు.

ఈ కార‌ణాల‌తో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను కాంగ్రెస్ అధినాయకత్వం సీరియస్‌ గానే పరిగణిస్తోంది. వచ్చే జీహెచ్‌ ఎంసీ ఎన్నికలు, నారాయణ్‌ ఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాలను చూసిన తర్వాత మార్పులకు పార్టీ నాయకత్వం శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ‘ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం రాష్ట్ర కాంగ్రెస్ చర్యలను గమనిస్తోంది. జీహెచ్‌ ఎంసి ఎన్నికల్లో పార్టీ సాధించే ఫలితాలను బేరీజు వేస్తుంది. నారాయణ్‌ ఖేడ్ - జీహెచ్‌ ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తలరాత మారకపోతే మాత్రం ప్రక్షాళన చర్యలు ఉంటాయి. అందులో పెద్ద‌త‌ల‌ల సీటు మార‌డం ఖాయం’ అని పార్టీ వ‌ర్గాలే జోరుగా ప్ర‌చారం చేస్తున్నాయి. ఎంతసేపు టీఆర్‌ ఎస్ ప్రజావ్యతిరేక విధానాలను విమర్శిస్తూ కాలక్షేపం చేయడం మినహా సొంత ఇంటిని చక్కపెట్టుకుని పార్టీని పటిష్ఠం చేసే దిశగా టీపీసీసీ నేతలు ఆలోచించడం లేదని వారు ఆరోపిస్తున్నారు.