Begin typing your search above and press return to search.

పార్టీ ఫండ్.. ఉత్తమ్, భట్టి టార్గెట్..?

By:  Tupaki Desk   |   6 Jan 2019 6:32 AM GMT
పార్టీ ఫండ్.. ఉత్తమ్, భట్టి టార్గెట్..?
X
కాంగ్రెస్ పోస్టుమార్టంలో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నేతలందరూ తెలంగాణ కాంగ్రెస్ కు నాయకత్వం వహించిన పీసీసీ చీఫ్ ఉత్తమ్, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టిలను టార్గెట్ చేసినట్టు సమాచారం.. తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి బాబు సహా పారిశ్రామికవేత్తలు, ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీల నుంచి ఎన్నికల వేళ పార్టీ ఫండ్ రూపంలో భారీగా ఇచ్చినట్టు వార్తలొచ్చాయి. ఈ ఫండ్ ను ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల్లో జనరల్ సీట్లకు కోటి, బీసీలున్న చోట 2 కోట్లు.. ఎస్సీ, ఎస్టీలకు 4 కోట్లు ఇవ్వాలని మొదట అనుకున్నారట.. కానీ ఎన్నికల హడావుడిలో పంచకుండా వదిలేశారట..

ఉత్తమ్, భట్టిలు కనీసం 10 నుంచి 15 అసెంబ్లీ సీట్లలో పంచాల్సిన డబ్బును వారి నియోజకవర్గాల్లోనే పంచారని తాజాగా కాంగ్రెస్ పోస్టుమార్టంలో నేతలు ఆరోపించినట్టు సమాచారం.. అందుకే ఉత్తమ్ , భట్టిలు బోటాబోటీ మెజార్టీతో గెలిచారని.. ఆ డబ్బులు పంచకపోతే గెలిచేవారు కాదంటూ కాంగ్రెస్ నేతలు పోస్టుమార్టంలో నిలదీసినట్టు కాంగ్రెస్ నేతలు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు.

ఈ ఆరోపణలు బయటకు రావడంతో కలకలం రేగింది. ఉత్తమ్ , భట్టిలిద్దరూ తమ సొంత డబ్బును ఖర్చు పెట్టకుండా పార్టీ ఫండ్ నే ఖర్చు పెట్టారని కాంగ్రెస్ నేతలు నిలదీసినట్టు తెలియడంతో ఓడిపోయిన వారు భగ్గుమన్నారు.. వారిద్దరూ ఓటమి దశ నుంచి కొద్ది మెజార్టీతో గెలవడానికి డబ్బుల పంపిణీయే కారణమని నేతలు నిలదీశారట.. తమకూ పంచితే కాంగ్రెస్ కనీసం 10 సీట్లలోనైనా గెలిచేదని.. ఎందుకు పంచలేదని ప్రశ్నించినట్టు సమాచారం.

ఏదీ ఏమైనా పోస్టుమార్టం పేరిట కాంగ్రెస్ నిర్వహిస్తున్న సమావేశాల్లో కొత్త నిజాలు బయటకు వస్తూ కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపిస్తున్నాయి.