Begin typing your search above and press return to search.

తేల్చేశారు; నేటి డిప్యూటీనే రేపటి గవర్నర్

By:  Tupaki Desk   |   21 Aug 2016 6:23 AM GMT
తేల్చేశారు; నేటి డిప్యూటీనే రేపటి గవర్నర్
X
రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా వ్యవహరిస్తున్న రఘురాం రాజన్ వారసుడు ఎవరన్నది తేలిపోయింది. రాజన్ పదవీ విరమణ తర్వాత ఆ బాధ్యతను ఎవరు చేపడతారన్న అంశంపై స్పష్టత వచ్చేసింది. కొత్త గవర్నర్ గా ప్రస్తుతం ఆర్ బీఐ డిప్యూటీ గవర్నర్ గా వ్యవహరిస్తున్న ఉర్జిత్ పటేల్ పేరును కేంద్రం ఖరారు చేసింది. ప్రస్తుతం ద్రవ్య విధానం.. ద్రవ్యోల్బణం విభాగాలకు నేతృత్వం వహిస్తున్న ఆయన.. 24వ ఆర్ బీఐ గవర్నర్ గా సెప్టెంబరులో బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆర్ బీఐ డిప్యూటీ గవర్నర్ గా వ్యవహరించేవారు.. తర్వాతి కాలంలో గవర్నర్లుకావటం మామూలే. ఆ లెక్కన చూస్తే డిప్యూటీ కాస్తా గవర్నర్ అయిన వారిలో ఉర్జిత్ ఏడో వారు అవుతారు. 52 ఏళ్ల పటేల్ ఈ పదవిలో మూడేళ్లు కొనసాగనున్నారు. ఉర్జిత్ ను యూపీఏ హయాంలోనే డిప్యూటీ గవర్నర్ గా నియమించారు. వాస్తవానికి ఈ మధ్యనే ఆయన పదవీ కాలం పూర్తి అయ్యింది. అయితే.. మోడీ సర్కారు ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

దేశ ఆర్థిక పరిస్థితిని సమర్థవంతంగా నడిపిన రఘురాం రాజన్ వారసుడిగా ఎలాంటి వ్యక్తి వస్తారు? ఆయనకున్న ఆర్థిక క్రమశిక్షణను ఆయన వారసులు కొనసాగిస్తారా? లాంటి సందేహాలు వ్యక్తమవుతున్న వేళ.. ఉర్జిత్ నియామకం పట్ల సర్వత్రా సానుకూలత వ్యక్తమయ్యే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. ఉర్జిత్ నేతృత్వంలోనే ఆర్ బీఐ గవర్నర్ తీసుకునే నిర్ణయాలకు సంబంధించిన పలు కీలక సంస్కరణలు ఉర్జిత్ తీసుకున్నారని చెబుతారు. ఆయన తీసుకున్న కీలక నిర్ణయాల విషయానికి వస్తే.. ద్రవ్యోల్బణ లక్ష్యాల సాధన.. రెపో రేట్ సహా కీలక రేట్లను గవర్నర్ ఒక్కరే ఏకాభిప్రాయం తీసుకోకుండా కొత్త విధానాన్న తెర మీదకు తీసుకొచ్చారు. గవర్నర్ స్థానే ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయటం లాంటివి పటేల్ నేతృత్వంలోనే జరిగాయి. రాజన్ నిష్క్రమిస్తున్న వేళ.. ఆయన స్థానాన్ని సొంతం చేసుకున్న ఉర్జిత్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. వాటిని ఆయన ఎంతవరకూ నెరవేర్చగలరో చూడాలి.