Begin typing your search above and press return to search.

సివిల్స్‌ లో తెలుగోళ్లు దుమ్ము రేపారు

By:  Tupaki Desk   |   1 Jun 2017 4:25 AM GMT
సివిల్స్‌ లో తెలుగోళ్లు దుమ్ము రేపారు
X
దేశంలోనే అత్యుత్త‌మ ప‌రీక్ష‌ల్లో ఒక‌టైన సివిల్స్ ఫ‌లితాలు తాజాగా విడుద‌ల‌య్యాయి. ఈసారి సివిల్స్ ఫ‌లితాల గొప్ప‌త‌నం ఏమిటంటే.. దేశ వ్యాప్తంగా మ‌రే రాష్ట్రానికి చెందిన వారు సాధించ‌లేని రీతిలో తెలుగు రాష్ట్రాల అభ్య‌ర్థులు భారీ విజ‌యాల్ని సొంతం చేసుకున్నారు. 2016 సివిల్స్ స‌ర్వీసెస్ ఎగ్జామినేష‌న్స్ ఫ‌లితాలు బుధ‌వారం రాత్రి వెల్ల‌డి కాగా.. ఈ ఫ‌లితాల్లో మొత్తం 1099 మంది వివిధ స‌ర్వీసుల‌కు ఎంపికయ్యారు. వారిలో 90 మంది కేవ‌లం తెలుగు రాష్ట్రాల‌కు చెందిన వారు విజ‌యం సాధించ‌టం గ‌మ‌నార్హం.

గ‌డిచిన ఆగ‌స్టులో నిర్వ‌హించిన సివిల్స్ ప్రిలిమ్స్ ప‌రీక్ష‌లో 11.35 ల‌క్ష‌ల మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా.. 4.59 ల‌క్ష‌ల మంది ప‌రీక్ష రాశారు. వీరిలో మొయిన్స్‌కు 15,452 మంది ఎంపిక‌య్యారు. చివ‌ర‌కు 2,961 మందిని ఈ ఏడాది మార్చి.. ఏప్రిల్ లో నిర్వ‌హించిన మౌఖిక ప‌రీక్ష‌కు ఎంపిక చేశారు. వీరిలో 1099 మందిని సివిల్స్ లోని వివిధ విభాగాల కోసం ఎంపిక చేశారు.

సివిల్స్ లో మొత్తం స‌ర్వీసులు చూస్తే..ఐఏఎస్‌.. ఐఎఫ్ఎస్‌.. ఐపీఎస్‌.. సెంట్ర‌ల్ స‌ర్వీసెస్ గ్రూప్ ఏ.. గ్రూప్ బీలు ఉన్నాయి. సివిల్స్ సాధించిన వారిలో 253 మంది మ‌హిళ‌లు ఉండ‌టం ఒక విశేష‌మైతే.. టాప్ 25లో 18 మంది పురుషులు.. ఏడుగురు మ‌హిళ‌లు ఉన్నారు.

వివిధ కేట‌గిరిల కింద ఎంపికైన వారిలో 500 మంది జ‌న‌ర‌ల్ కేట‌గిరి కాగా.. 347 మంది ఓబీసీలు.. 163 మంది ఎస్సీ.. 89 మంది ఎస్టీ కేట‌గిరికి చెందిన వారున్నారు. మ‌రో 172 మందిని రిజ‌ర్వు లిస్టులో ఉంచారు. సివిల్స్‌లో అత్యుత్త‌మ స‌ర్వీస్ అయిన ఐఏఎస్‌ లో మొత్తం 180 మంది ఎంపిక కాగా.. వీరిలో జ‌న‌ర‌ల్ నుంచి ఎంపికైన వారు 90 మంది కాగా.. ఓబీసీలు 47 మంది ఉన్నారు. ఎస్సీలు 27 మంది కాగా ఎస్టీలు 14 మంది.

ఇక టాప్ ర్యాంకుల విష‌యానికి వ‌స్తే.. క‌ర్ణాట‌క‌కు చెందిన కేఈఆర్ నందిని తొలి ర్యాంకును సొంతం చేసుకున్నారు. నాలుగో ప్ర‌య‌త్నంలో ఆమె తొలిస్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఆమె ఇప్ప‌టికే ఐఆర్ ఎస్ గా శిక్ష‌ణ పొందుతున్నారు. అన్మోల్ షేర్ సింగ్ బేడీ రెండో ర్యాంకును సొంతం చేసుకున్నారు. పంజాబ్‌కు చెందిన ఈ యువ‌కుడు బిట్స్ పిలానీలో కంఫ్యూట‌ర్ సైన్స్ లో బీఈ పూర్తి చేశారు. మూడో స్థానంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన రోణంకి గోపాల కృష్ణ నిలిచారు. విజ‌య‌వాడ‌కు చెందిన కొత్త‌మాసు దినేశ్ కుమార్ ఆరో ర్యాంకు సాధించ‌గా.. మాజీ ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్ కుమారుడు ముజమిల్ ఖాన్ జాతీయ స్థాయిలో 22వ ర్యాంకులో నిలిచారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. సివిల్స్ కు ఎంపికైన వారిలో ఎక్కువ మంది ఆంత్రోపాల‌జీని ఆప్ష‌న‌ల్‌ ను ఎంచుకున్న వారే కావ‌టం విశేషం. తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన వారిలో ఎక్కువ‌మంది దీన్నే ఎంచుకున్నారు. ఇదిలా ఉంటే..సివిల్స్ ఫ‌లితాల‌కు సంబంధించి రాచ‌కొండ పోలీసు క‌మిష‌న‌ర్ మ‌హేశ్ ముర‌ళీధ‌ర్ భ‌గ‌వ‌త్ పాత్ర‌ను ప్ర‌స్తావించాల్సిన అవ‌స‌రం ఉంది. ఎందుకంటే ఈసారి సివిల్స్ ఇంట‌ర్వ్యూల‌కు సుమారు 300 మందికి శిక్ష‌ణ ఇవ్వ‌గా.. ఆయ‌న ద‌గ్గ‌ర ట్రైనింగ్ పొందిన వారిలో వంద మందికి వివిధ ర్యాంకులు రావ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్పాలి.

సివిల్స్ విజేత‌ల్లో ప‌లువురివి స్ఫూర్తివంత నేప‌థ్యాలు ఉండ‌టం గ‌మ‌నార్హం. బాల ల‌త దివ్యాంగురాలు. ప్ర‌స్తుతం ఆమె ఇండియ‌న్ డిఫెన్స్ లో ప‌ని చేస్తున్నారు. 2004 సివిల్స్ లో ఆమెకు 399 ర్యాంకు రాగా.. ఈసారి ఆమెకు 167వ ర్యాంకు వ‌చ్చింది. మ‌రింత ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. సివిల్స్ ప‌రీక్ష‌ల‌కు స‌న్న‌ద్ధ‌మ‌య్యే వారికి ఆమె శిక్ష‌ణ ఇస్తుంటారు. జాతీయ స్థాయిలో మూడో ర్యాంకును సొంతం చేసుకున్న గోపాల‌కృష్ణ‌కు కూడా ఆమె విద్యార్థే. ప్ర‌తిభ‌కు అంగ‌వైకల్యం అడ్డురాద‌న్న విష‌యాన్ని చాటి చెప్ప‌టం కోస‌మే తాను సివిల్స్ రాశానే త‌ప్పించి.. అందులో చేరే ఉద్దేశం త‌న‌కు లేద‌ని చెప్ప‌టం ఆశ్చ‌ర్యాన్ని రేకెత్తించ‌టం ఖాయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/