Begin typing your search above and press return to search.

మునుగోడు '18' గోలేమిటో ?

By:  Tupaki Desk   |   12 Oct 2022 6:07 AM GMT
మునుగోడు 18 గోలేమిటో ?
X
మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో విధానపరమైన అంశాలు కాకుండా వ్యక్తిగతమైన ఆరోపణలే బాగా పాపులరవుతున్నాయి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద టీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అచ్చంగా ఇలాంటి అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణలను కేసీయార్ కుటుంబం మీద రాజగోపాల్ చేస్తున్నారు.

ఈ ఆరోపణలు, ప్రత్యారోపణల్లో 18 అనే అంకెకు మాత్రం బాగా డిమాండు పెరిగిపోతోంది. 18 అనే అంకె ఆధారంగా మొదటి ఆరోపణలు మొదలుపెట్టింది కాంగ్రెస్ అయితే తాజాగా టీఆర్ఎస్ నేతలందుకున్నారు.

ఇంతకీ ఈ 18 గొడవ ఏమిటంటే ఛత్తీస్ ఘర్లో రు. 18 వేల కోట్ల బొగ్గు గనుల కాంట్రాక్టు తీసుకున్న తర్వాతే రాజగోపాల్ కాంగ్రెస్ నుండి బీజేపీలోకి మారారనేది కేటీయార్ అండ్ కో ఆరోపణ. సరే ఇందులో నిజమే ఉందని అనుకున్నా అది రాజగోపాల్-బీజేపీ మధ్య వ్యవహారం. అయితే రు. 18 వేల కోట్ల వ్యవహారంపైనే టీఆర్ఎస్ బాగా ఫోకస్ పెట్టింది. కేవలం రు. 18 వేల కోట్ల కాంట్రాక్టు కోసమే రాజగోపాల్ బీజేపీలోకి మారారంటు టీఆర్ఎస్ బాగా ప్రచారం చేస్తోంది.

ఇక దీనికి విరుగుడుగా రాజగోపాల్ మాట్లాడుతూ కేసీయార్ కుటుంబం ధరణి పోర్టల్ ద్వారా తెలంగాణాలోని ప్రైవేటు, ప్రభుత్వం ఆధ్వర్యంలోని 18 లక్షల ఎకరాలను కబ్జా చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారంటు ఆరోపణలు మొదలుపెట్టారు. తెలంగాణాలో ఎక్కడెక్కడి ప్రభుత్వ భూములను కేసీయార్ కుటుంబమే కబ్జా చేయిస్తోందని ఆరోపణలను మొదలుపెట్టారు.

గ్రేటర్ హైదరాబాద్ తో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల కోట్ల రూపాయలు విలువైన భూములను కేసీయార్ కుటుంబం కొట్టేస్తోందంటు ఆరోపణలమీద ఆరోపణలు గుప్పిస్తున్నారు. రాజగోపాల్ పైన అసలు రు. 18 వేల కోట్ల కాంట్రాక్టంటు మొదలుపెట్టింది పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డే.

బాగా గోలగోల చేసి కాంగ్రెస్ వాళ్ళు వదిలేసిన తర్వాత టీఆర్ఎస్ అందుకున్నది. ఆరోపణలతో సరిపెట్టుకోకుండా ఇదే విషయాన్ని పోస్టర్ల రూపాంలో నియోజకవర్గమంతా అంటించి ప్రచారం చేస్తోంది. మొత్తానికి మునుగోడు ఉపఎన్నికల్లో 18 అంకెకు బాగా డిమాండ్ పెరిగిపోతోంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.