Begin typing your search above and press return to search.

ఉపహార్ థియేటర్ ఘోరం : 24 ఏళ్ల తర్వాత .. ఏడేళ్ల జైలు శిక్ష !

By:  Tupaki Desk   |   9 Nov 2021 3:33 PM GMT
ఉపహార్ థియేటర్ ఘోరం : 24 ఏళ్ల తర్వాత ..  ఏడేళ్ల జైలు శిక్ష !
X
1997 నాటి ఉపహార్ థియేటర్ అగ్ని ప్రమాదం కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారన్న ఆరోపణలు రుజువు కావడంతో పారిశ్రామివేత్తలు సుశీల్ అన్సల్, గోపాల్ అన్సల్‌ లకు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. ప్రముఖ వ్యాపారవేత్తలు సుశీల్ అన్సల్, గోపాల్ అన్సల్‌ లకు ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు చెరో రూ.2.25 కోట్లు జరిమానా విధించింది. 1997 నాటి ఉపహార్ థియేటర్ అగ్ని ప్రమాదం కేసులో వీరిద్దరు సాక్ష్యాలను తారుమారు చేసినట్లు రుజువు కావడంతో కోర్టు ఈ శిక్ష విధించింది. గతంలో ఇదే కేసులో సుప్రీం కోర్టు వీరికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది.

కోర్టు షరతు మేరకు చెరో రూ.30 కోట్లు జరిమానా చెల్లించి విడుదలయ్యారు. ఆ డబ్బును ఢిల్లీలో ట్రామా సెంటర్ నిర్మాణానికి వినియోగించారు. తాజా తీర్పు సందర్భంగా న్యాయమూర్తి పంకజ్ శర్మ మాట్లాడుతూ, ఎన్నో రాత్రులు ఈ కేసు గురించి లోతుగా ఆలోచించినట్లు చెప్పారు. చివరకు, ఈ కేసులో దోషులు శిక్షార్హులేనన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. తమను దోషులుగా నిర్దారించే కీలక ఆధారాలను ఆ ఇద్దరు ధ్వంసం చేశారని పేర్కొన్నారు. ఈ కేసులో అన్సల్ బ్రదర్స్‌ తో పాటు వారి వద్ద పనిచేసిన పీపీ బాత్రా, అనూప్ సింగ్ అనే ఉద్యోగులు, దినేశ్ చంద్ శర్మ అనే మాజీ కోర్టు సిబ్బందికి కూడా ఏడేళ్ల జైలు శిక్ష పడింది.

ఇదే కేసులో నిందితులుగా ఉన్న హర్ స్వరూప్ పన్వర్, ధరమ్ వీర్ మల్లోత్రా కేసు విచారణ దశలో ఉండగానే మృతి చెందారు. ఉపహార్ థియేటర్‌లో 1997, జూన్ 13న భారీ అగ్ని ప్రమాదం జరిగింది. థియేటర్‌లో హిందీ సినిమా 'బోర్డర్' ప్రదర్శన జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిప్రమాదంలో 59 మంది మృతి చెందగా.. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఏవీయూటీ ఛైర్‌ పర్సన్ నీలం కృష్ణమూర్తి కోర్టును ఆశ్రయించారు. అప్పటినుంచి సుదీర్ఘ కాలంగా కేసు విచారణ కొనసాగుతూ వస్తోంది. ఇదే క్రమంలో ఈ అగ్ని ప్రమాదం కేసులో మొదటిసారిగా జులై 20, 2002లో కేసులో సాక్ష్యాధారాలు తారుమారైనట్లు గుర్తించారు. దీనికి బాధ్యుడిగా గుర్తించిన కోర్టు సిబ్బంది దినేశ్ శర్మను 2004లో విధుల నుంచి తప్పించారు. అక్టోబర్ 8న ఈ కేసుకు సంబంధించిన తుది విచారణ జరగ్గా, అన్సల్ సోదరులతో పాటు పీపీ బాత్రా, అనూప్ సింగ్, దినేశ్ శర్మలను కోర్టు దోషులుగా తేల్చి, శిక్ష ఖరారు చేసింది.