Begin typing your search above and press return to search.

భారత్ - చైనాలకు ఐక్యరాజ్యసమితి గుడ్ న్యూస్

By:  Tupaki Desk   |   31 March 2020 2:02 PM GMT
భారత్ - చైనాలకు ఐక్యరాజ్యసమితి గుడ్ న్యూస్
X
కరోనా....చైనాలోని వుహాన్ లో పుట్టిన ఈ పిశాచి వైరస్...ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. మనుషుల ఊపిరితిత్తులపై దాడిచేసే ఈ మహమ్మారి వైరస్....ఆయా దేశాలకు ఊపిరితిత్తులవంటి ఆర్థిక వ్యవస్థలపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే కరోనా దెబ్బకు ఆ వైరస్ సోకిన దేశాలలో ఆర్థిక స్థితిగతులు దారుణంగా తయారయ్యాయి. కరోనా నుంచి మనుషులు కోలుకున్నప్పటికీ...ఈ వైరస్ కొట్టిన దెబ్బకు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు మాత్రం కోలుకునే పరిస్థితి లేదని ఐక్యరాజ్యసమితి సంచలన విషయాలు వెల్లడించింది. కరోనా కాటుకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం కోరల్లో చిక్కుకోవడం ఖాయమని ఐక్యరాజ్య సమితి మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా పంచ్ కు పలు ప్రపంచ దేశాలు లక్షల కోట్ల డాలర్ల ఆదాయాన్ని కోల్పోతాయని, అయితే, ఆర్థిక మాంద్యం ప్రభావం చైనా, భారత్‌లపై పెద్దగా ఉండదని ఐరాస తెలిపింది. 'అభివృద్ధి చెందుతున్న దేశాలకు కోవిడ్‌-19 షాక్‌' పేరుతో యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ (UNCTAD) ఓ ఆసక్తికర నివేదిక విడుదల చేసింది.

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో చైనా, భారత్ లు మొదటి, రెండవ స్థానాల్లో ఉన్నాయి. కరోనా పుట్టిన చైనాతోపాటు పొరుగు దేశం భారత్ కూడా కరోనా బారిన పడి విలవిలలాడుతోంది. అయితే, చైనా, భారత్ మినహా అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంటుందని UNCTAD హెచ్చరించింది. వస్తువుల ఎగుమతులపై ఆధారపడిన అభివృద్ధి చెందుతున్న దేశాలకు 2.5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక ప్యాకేజీ అవసరమని ఐరాస చెప్పింది. కరోనా వల్ల ఆయా దేశాలు దాదాపు 3 లక్షల కోట్ల డాలర్ల విదేశీ పెట్టుబడులను కూడా కోల్పోబోతున్నాయని ఐరాస అంచనా వేసింది. చైనాతో పాటు మరికొన్ని దేశాలు ప్రకటించిన భారీ ప్యాకేజీల వల్ల ఉపయోగం లేదని అభిప్రాయపడింది. అయితే, ఆరోగ్య సంక్షోభం నుంచి కాపాడేందుకు 500 బిలియన్ డాలర్ల నిధిని ఏర్పాటు చేయాలని సూచించింది. భవిష్యత్తులో విదేశీ మారక నిబంధనలు కఠినతరం కావొచ్చని అంచనా వేసింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) నిబంధనలను సడలించడం ద్వారా ఆయా దేశాలకు లక్ష కోట్ల డాలర్ల ద్రవ్య లభ్యత కల్పించాలని, అప్పులను పూర్తిగా రద్దు చేయడం లేదా సగం రద్దు చేయడం వంటి చర్యల వల్ల కొద్దిగా ఫలితం ఉంటుందని తెలిపింది.