Begin typing your search above and press return to search.

శ్రీ‌నివాస్ హత్య‌పై ఐరాస రియాక్ష‌న్‌...

By:  Tupaki Desk   |   26 Feb 2017 8:35 AM GMT
శ్రీ‌నివాస్ హత్య‌పై ఐరాస రియాక్ష‌న్‌...
X
కాన్సస్‌లో ఇండియన్ సాఫ్ట్‌ వేర్ ఇంజినీర్ శ్రీనివాస్ కూచిభొట్లను కాల్చివేయడాన్ని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తీవ్రంగా ఖండించారు. ప్రపంచవ్యాప్తంగా కొద్ది నెలలుగా జాతి వివక్ష - ముస్లింల పట్ల వివక్ష ఘటనలు పెరిగిపోతున్నాయన్నారు. విదేశీయుల పట్ల విపరీతమైన వ్యతిరేకత, ముస్లింల పట్ల భయం, వ్యతిరేకత కలిగి ఉండటం సరి కాదన్నారు. విదేశీయుల పట్ల, ముస్లింల పట్ల వ్యతిరేకత చూపడం తప్పని గుటెరస్ పేర్కొన్నారని ఆయన అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ చెప్పారు.

మ‌రోవైపు అమెరికాలో లక్షల సంఖ్యలో భారతీయులు నివసిస్తున్నా.. ఎప్పుడూ వివాదాలకు దూరంగానే ఉంటున్నారని సాక్షాత్తు ఆ దేశ నివేదిక‌లు స్ప‌ష్టం చేస్తున్నాయి. ద్వేషపూరిత నేరాలు తక్కువగా ఉండే ప్రాంతాల్లోనే మన దేశస్థులు నివసించడానికి ఇష్టపడుతారని నివేదికలు తేల్చిచెప్పాయి. కాన్సస్ రాష్ట్రంలోని ఓ బార్‌లో హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్ కూచిభొట్ల జాతి వివక్షతో హత్యకు గురికావడం సంచలనం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. కాన్సస్ రాష్ట్రం ద్వేషపూరిత నేరాలకు దూరంగా ఉంటుందని, ఇక్కడ మనదేశస్థులు ఎక్కువ సంఖ్యలో నివాసం ఉంటున్నా అసమానతలు కనిపించలేదని నివేదికలు చెప్తున్నాయి. అమెరికా టాప్ ఇన్వెస్టిగేష‌న్ విభాగ‌మైన‌ ఎఫ్‌బీఐ నివేదికల ప్రకారం 2015లో అమెరికాలో 4,586 జాతివివక్షాపూరిత నేరాలు జరిగాయి. ఇందులో నార్త్ డకోటా రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. ఈ రాష్ట్ర జనాభాతో పోల్చితే భారతీయుల జనాభా 0.28 శాతం మాత్రమే. నాలుగో స్థానం లో నిలిచిన మోంటానా రాష్ట్ర జనాభాలో భారతీయులు 0.05 మాత్రమే ఉన్నారు. ఇది ఇతర రాష్ర్టాలతో పోల్చితే అతితక్కువ. కాన్సస్ రాష్ట్రం 54 నేరాలతో ఈ జాబితాలో 15వ స్థానంలో నిలిచింది. ఇక్కడి జనాభాలో ఇండియన్స్ 0.52 శాతంగా ఉన్నారు. నేరాలు అధికంగా జరిగే కొన్ని ప్రాంతాల్లో భారతీయులు సైతం అధికంగా నివసిస్తున్నారు. 2014 నుంచి అమెరికాలో ద్వేషపూరిత నేరాల సంఖ్య పెరుగుతున్నదని ఎఫ్‌బీఐ తెలిపింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/