Begin typing your search above and press return to search.

కేంద్ర మంత్రివ‌ర్గం కీల‌క నిర్ణ‌యాలు ఇవే..

By:  Tupaki Desk   |   24 Jun 2020 1:00 PM GMT
కేంద్ర మంత్రివ‌ర్గం కీల‌క నిర్ణ‌యాలు ఇవే..
X
దేశంలో పెను స‌వాళ్లు ఎదుర్కొంటున్న స‌మ‌యంలో బుధ‌వారం కేంద్ర మంత్రివ‌ర్గం స‌మావేశ‌మైంది. ప్రధానమంత్రి న‌రేంద్ర మోదీ అధ్యక్షతన జ‌రిగిన ఈ సమావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు స‌మాచారం. సుదీర్ఘంగా సాగిన ఈ స‌మావేశంలో ప‌లు అంశాల‌పై విస్తృతంగా చ‌ర్చ‌లు సాగిన‌ట్లు తెలుస్తోంది. వైర‌స్ క‌ట్ట‌డి.. స‌రిహద్దులో ఉద్రిక్త‌త‌.. ఆర్థిక వ్య‌వ‌స్థ పుంజుకోవ‌డం వంటి విష‌యాల‌పై మంత్రివ‌ర్గం స‌మాలోచ‌న‌లు చేసింది. ఈ సంద‌ర్భంగా స‌మావేశం అనంత‌రం కేంద్ర మంత్రులు స‌మావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు తెలిపారు. ఈ స‌మావేశంలో తీసుకున్న కీల‌క నిర్ణ‌యం.. సహకార బ్యాంకులను రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పరిధిలోకి తెస్తూ నిర్ణయం. దేశవ్యాప్తంగా 1,540 సహకార బ్యాంకులు ఆర్బీఐ పరిధిలోకి తెస్తూ ఆర్డినెన్స్‌ను మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 8 కోట్ల 60 లక్షల డిపాజిటట్ల‌కు భద్రత ల‌భించినుంది.

- ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN-SPACe) ద్వారా భారతీయ అంతరిక్ష మౌలిక సదుపాయాలను ఉపయోగించుకోవడానికి ప్రైవేట్ సంస్థలకు వెసులుబాటు కల్పించేలా నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో అంతరిక్ష కార్యకలాపాలలో ప్రైవేట్ పరిశ్రమలను ప్రోత్సహించడం, మార్గనిర్దేశం చేస్తుందని కేంద్రం భావిస్తోంది.
- ప్రధాన్ ‌మంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) కింద శిశులోన్ కేటగిరీ రుణ గ్రహీతలకు 2 శాతం వడ్డీని తగ్గించే పథకానికి మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. 2020 మార్చి 31 నాటికి అర్హత ఉన్న రుణగ్రహీతలకు 12 నెలల కాలానికి రుణాలు మంజూరు చేయ‌నున్నారు.
- ఇతర వెనుకబడిన వర్గాలలో ఉప వర్గీకరణ సమస్యను 6 నెలల్లో (31 జ‌‌న‌వ‌రి 2021) వరకు పరిశీలించడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 ప్రకారం ఏర్పాటు చేసిన కమిషన్ పదవీకాలాన్ని పొడిగించారు. ఈ మేర‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
- ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్ ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ విమానాశ్రయంగా మారుస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.
- పశుసంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి ఏర్పాటుకు కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది.