Begin typing your search above and press return to search.

డ్రాగన్ కు బుద్ది చెప్పేలా గల్వాన్ లో త్రివర్ణ పతాకం రెపరెపలు

By:  Tupaki Desk   |   5 Jan 2022 2:58 AM GMT
డ్రాగన్ కు బుద్ది చెప్పేలా గల్వాన్ లో త్రివర్ణ పతాకం రెపరెపలు
X
నువ్వు ఒకటంటే.. నేను రెండు అంటా. నువ్వు నాలుగు అంటే.. నేను పద్నాలుగు అంటా. బాబు.. టైం మారింది. గతంలో మాదిరి.. మాటలకు అదిరిపడటం.. చేతలకు వణకటం.. ఏం చేయాలన్న సందేహం.. ముందుకు అడుగు వేయటానికి సంకోచం లాంటివి ఇప్పుడు భారత నాయకత్వంలో కనిపించటం లేదు. విషయం ఏదైనా సరే.. పూర్తిస్థాయి స్పష్టత.. ఏం చేయాలన్న దానిపై అవగాహన కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.

తూర్పు లద్ధాఖ్ లోని గల్వాన్ లోయలో కొత్త సంవత్సరం ప్రారంభ రోజున జాతీయ పతాకాన్ని ఎగురవేసి.. ఆ ప్రాంతం తమదేనంటూ మైండ్ గేమ్ ఆడిన చైనాకు.. భారత సైన్యం సైతం ధీటైన సమాధానం ఇచ్చింది. వివాదం లేని.. తమ ప్రాంతంలో జెండా ఎగురవేసుకున్న చైనా సైనికులు.. తామేదో ఘనకార్యాన్ని సాధించినట్లుగా ఫోజులు ఇచ్చి అడ్డంగా బుక్ అయ్యారు. చైనా సైనికులకు ధీటుగా.. మన దేశ సైనికులు సైతం అత్యాధునిక ఆయుధాల్ని చేతపట్టి.. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన వైనం.. దానికి సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.

తాజా పరిణామంతో.. చైనాకు గట్టి బదులు ఇవ్వటమే కాదు.. చైనాకు చెంపదెబ్బ మాదిరి తన ట్వీట్ తో చెప్పాల్సిన సమాధానాన్ని చెప్పేశారు కేంద్ర మంత్రి కిరణ్ రిజోజు. సుమారు 30 మంది వరకు భారత సైనికులు వాస్తవాధీన రేఖ వద్ద ఆయుధాన్ని చేతపట్టి.. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ ఫోటోలు దిగిన వైనాన్ని కేంద్ర మంత్రి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

గల్వాన్ లోయలో తాము జెండా ఎగురువేసినట్లుగా గొప్పలు చెప్పిన చైనా.. తన భూభాగంలో జెండా ఎగురవేసింది. ఈ విషయాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసింది. అయితే.. చైనా మైండ్ గేమ్ ను భారత్ అందరికి అర్థమయ్యేలా స్పష్టం చేసింది. అంతేకాదు.. జెండా ఎగురవేసి కవ్వించే ప్రయత్నం చేసిన చైనాకు. దానికి అర్థమయ్యే భాషలో బలమైన సమాధానాన్ని కేంద్ర మంత్రి ఇచ్చారని చెప్పక తప్పదు.