Begin typing your search above and press return to search.

ప్రత్యర్థి పార్టీ ఎంపీ ఆశీస్సులు తీసుకున్న కేంద్రమంత్రి స్మృతీ

By:  Tupaki Desk   |   1 Feb 2022 4:30 AM GMT
ప్రత్యర్థి పార్టీ ఎంపీ ఆశీస్సులు తీసుకున్న కేంద్రమంత్రి స్మృతీ
X
ఆమె అలాంటి ఇలాంటి కేంద్రమంత్రి కాదు. తనకు తానుగా సొంతంగా ఎదిగిన రాజకీయ మహిళా నేత. ఎలాంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా మొదలైన ఆమె జర్నీ ప్రస్తుతం కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్నారు. మోడీ సర్కారులో ఆమె కీలకభూమిక పోషిస్తున్నారనే చెప్పాలి. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ హవా జోరుగా సాగుతున్న వేళ.. ఆమె ప్రాతినిధ్యం వహించే అమేధీకి వెళ్లి మరీ బరిలో నిలిచి.. ఓటమిపాలైన ధీశాలి. సోనియా చేతిలో ఓడినా సరే.. ఆమెకు గట్టి పోటీ ఇవ్వటంలో మాత్రం ఆమె విజయం సాధించారనే చెప్పాలి.

కేంద్రంలో తొలిసారి మోడీ సర్కారు కొలువు తీరిన వేళ.. ఆమెను కేంద్రమంత్రిగా నియమించిన వేళకు ఆమె ఎంపీగా గెలిచింది లేదు. కానీ.. కేంద్రమంత్రిగా ఆమెకు మోడీ సర్కారు ఇచ్చిన ప్రాధాన్యత చూసినప్పుడు మాత్రం.. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి ఎలాంటి గుర్తింపు దక్కుతుందన్న విషయం అందరికి అర్థమయ్యేలా చేసింది. అలాంటి ఆమె తాజాగా వార్తల్లోకి వచ్చారు. అది కూడా ఆమె చేసిన పని అనూహ్యంగా మారటంతో పాటు.. పొలిటికల్ హీట్ జనరేట్ చేసేలా చేసింది.

ప్రస్తుతం యావత్ దేశం ఎంతో ఆసక్తిగా చూస్తున్నయూపీ ఎన్నికల వేళ.. అధికార బీజేపీకి ప్రధాన ప్రత్యర్ధిగా ఉన్న సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు.. ఎంపీగా వ్యవహరిస్తున్న 82 ఏళ్ల ములాయం సింగ్ యాదవ్ సోమవారం పార్లమెంటుకు వస్తున్న వేళలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అడుగులో అడుగు వేసుకుంటూ.. మెట్లను దిగేందుకు అపసోపాలు పడుతున్న ఆయన వద్దకు వెళ్లిన కేంద్రమంత్రి స్మృతీ .. ఆయనకు దగ్గరగా వెళ్లి వినమ్రతతో వంగి నమస్కారం చేయటం.. అందుకు ప్రతిగా ఆయన ఆశీస్సులు అందించటం చూసినోళ్లంతా ఆశ్చర్యపోయిన పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయంగా విబేధించే పార్టీకి చెందిన వారిని లైట్ తీసుకునే వేళ.. అందునా కేంద్రమంత్రిగా ఉన్న నేత వెళ్లి వినమ్రతను ప్రదర్శించటమా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

ఓపక్క యూపీకి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ.. విపక్ష సమాజ్ వాదీ పార్టీ హోరాహోరీగా తలపడుతున్నారు. ఇలాంటి వేళ.. తమ ప్రత్యర్థి పార్టీకి చెందిన పెద్దాయన ఆశీస్సులు తీసుకోవటం హాట్ టాపిక్ గా మారింది. ములాయం మీద అభిమానంతో కేంద్రమంత్రి స్మృతీ ఇలా చేశారా? లేక.. యూపీ ఎన్నికల నేపథ్యంలో ‘సీన్’ చూపించారన్న దానిపై క్లారిటీ లేనప్పటికీ.. ఈ ఉదంతం మాత్రం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెర తీసినట్లుగా చెప్పాలి.

ములాయం మెట్లు దిగుతున్న వేళ.. ఎంతో మర్యాదపూర్వకంగా ఆయన కోసం వెయిట్ చేసిన ఆమె.. ఆయనకు దగ్గరగా వెళ్లి.. ఆయన క్షేమ సమాచారం గురించి అడగటం.. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. కీలకమైన ఎన్నికల వేళ.. కేంద్రమంత్రి స్మృతీ వ్యవహరించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.