Begin typing your search above and press return to search.

రైతు ఉద్యమం కాదు ... పాక్, చైనా వెనుకనుండి కథ నడుపుతున్నాయి : కేంద్రమంత్రి

By:  Tupaki Desk   |   10 Dec 2020 11:01 AM GMT
రైతు ఉద్యమం కాదు ... పాక్, చైనా వెనుకనుండి కథ నడుపుతున్నాయి : కేంద్రమంత్రి
X
దేశ రాజధాని ఢిల్లీలో రైతులు కేంద్ర ప్రభుత్వం పై కాలు దువ్వుతూ కన్నెర్రజేస్తున్నారు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ, గత కొన్ని రోజులుగా ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. రైతులతో పలుసార్లు భేటీ నిర్వహించినా కూడా సంధి కుదరలేదు. రైతులు సవరణలతో అవసరం లేదు. ఆ మూడు చట్టాలని రద్దు చేయాల్సిందే అంటూ పట్టుబడుతున్నారు. అయితే కేంద్రం కూడా పూర్తిగా వెనక్కి తగ్గకపోవడం తో రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు.

అయితే , ఈ రైతు ఆందోళన పై కేంద్రమంత్రి రావ్‌ సాహేబ్ దాన్వే సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు నిరసనల వెనుక దాయాది పాక్, చైనా ఉన్నాయని, ఆ దేశాలు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపణలు చేశారు. ఎన్నార్సీ, సీఏఏ విషయంలో గతంలో ముస్లింలను కొందరు తప్పుదోవ పట్టించారని, ఆ ప్రయత్నాలేవీ సఫలం కాలేదని అన్నారు. అచ్చు అలాగే రైతులను కూడా ఇప్పుడు కొందరు తప్పుడు ప్రచారాలతో తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన తీవ్రంగా ఫైర్ అయ్యారు.

ఇదేమీ రైతుల ఉద్యమం కాదు. వీటి వెనుక పాక్, చైనాలున్నాయి. ఎన్నార్సీ, సీఏఏ వస్తున్నాయ్. ఆరు నెలల్లోగా మిమ్మల్ని తరిమేస్తారు అని ముస్లింలను భయపెట్టారు. ఒక్క ముస్లింనైనా వెళ్లగొట్టామా, వారి ప్రయత్నాలేవీ సఫలం కాలేదు. రైతుల విషయంలోనూ ప్రస్తుతం అలాంటి పుకార్లే చేస్తున్నారు అని దాన్వే చెప్పుకొచ్చారు. ఇక కేంద్రమంత్రికి అలాంటి సమాచారమంటూ ఉంటే వెంటనే రక్షణ శాఖ చైనా, పాక్‌ పై సర్జికల్ దాడులు చేయాలి. రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రి, త్రివిధ దళాలూ దీనిపై సీరియస్‌ గా ఆలోచించాలి అని సంజయ్ రౌత్ అన్నారు. రైతులకే ఇది అవమానం. రైతులు స్వతహాగా ఉద్యమిస్తున్నారు. ఎవరో ఉసిగొల్పితే కాదు, అని రైతు సంఘం నేత హన్నన్ మొల్లాహ్ తెలిపారు. రైతుల సమస్యలకు పరిష్కారం చూపకుండా.. వారిని ఒప్పించే ప్రయత్నాలు చేయకుండా.. ఇలా అన్నదాతలపై లేనిపోని తప్పుడు ప్రచారం చేయడం దేనికని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.