Begin typing your search above and press return to search.

వారిద్ద‌రి మాట‌లు కోట్లాది మందికి గుండెమంట‌

By:  Tupaki Desk   |   26 Feb 2018 1:40 AM GMT
వారిద్ద‌రి మాట‌లు కోట్లాది మందికి గుండెమంట‌
X
నోరు మూసుకొని ఉండే దానికి ఏదో ఉద్ద‌రించేందుక‌న్న‌ట్లుగా విప‌రీతంగా మాట్లాడేయ‌టం కొంద‌రు నేత‌లు చేస్తుంటారు. వారి మాట‌ల జ‌నాల బాగు కంటే వారు కొట్టుకు చచ్చేందుకు సాయం చేస్తుంటాయి. జ‌నం ఈతి క‌ష్టాలు పోయేలా చేసి.. దేశం అభివృద్ధి ప‌థంలో దూసుకెళ్లేలా వ్య‌వ‌హ‌రించాల్సిన రాజ‌కీయ నేత‌లు ఎంత‌సేప‌టికి మాట‌ల‌తో మంట పుట్టిస్తూ.. ఆ మంట‌ల్లో రాజ‌కీయ చ‌లిని కాచుకుంటూనే ఉంటారు.

జ‌నం ఎంత కొట్టుకు ఛ‌స్తే అంత మంచిద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తూ ఉంటారు. ఇలాంటి నాయ‌కులే దేశాన్ని ఏళ్ల‌కు ఏళ్లుగా ఏలుతుండ‌టం.. సరికొత్త రాజ‌కీయం పుట్ట‌కుండా పోతోంది. ఒక‌వేళ పుట్టే సాహ‌సం చేస్తే.. వారికి వెర్రిత‌నం.. పిచ్చిత‌నం.. ప్రాక్టికాలిటీకి దూరంగా వ్య‌వ‌హ‌రించే ధోర‌ణి అంటూ మ‌న‌సుకు న‌చ్చింది అనేస్తూ ఉండే ప‌రిస్థితి.

ఇలాంటి వేళ‌.. సంప్ర‌దాయ నేత‌ల‌దే హ‌వా. హిందుత్వ కార్డు ప‌ట్టుకొని ఒక పెద్ద‌మ‌నిషి.. మైనార్టీల బాగు కోస‌మే తాను.. త‌న కుటుంబం పుట్టింద‌ని నిండుగా న‌మ్మే నేత‌ల నిర్ల‌క్ష్య మాట‌లు స‌మాజానికి ఎంత చెడు చేస్తాయో తాజా వ్యాఖ్య‌ల్ని చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

ఇప్ప‌టికే మేం దేని గురించి మాట్లాడుతున్నామో ఇప్ప‌టికేఅర్థ‌మై ఉంటుంది. దేశంలోని కోట్లాది మంది హిందువులకు తానే ప్ర‌తినిధిలా వ్యాఖ్య‌లు చేయ‌టం బీజేపీ నేత‌లు చేస్తుంటారు. వీహెచ్ తో పోలిస్తే.. సంఘ్ కాస్త బెట‌ర్‌. ఈ రెండు సంస్థ‌లు రాజకీయ పార్టీలు కాకున్నా.. మంట పుట్టే మాట‌ల్ని మాట్లాడ‌టంలో మాత్రం వీరు ఎవ‌రికి తీసిపోరు.

ఇక.. మ‌రో పెద్ద‌మ‌నిషి మ‌జ్టిస్ అధినేత్ అస‌దుద్దీన్ ఓవైసీ. ఆయ‌న నోటికి అడ్డే ఉండ‌దు. తాను ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ‌కు.. తాను ప్ర‌తినిధ్యం వ‌హించే నియోజ‌క‌వ‌ర్గంలోని అంద‌రి ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల కోసం ప‌ని చేస్తానంటూ ప్ర‌మాణం చేసి మ‌రీ ఎంపీ ప‌ద‌విని చేప‌ట్టారు.

కానీ.. ఏ రోజు కూడా ఆయ‌న ఆ ప‌ని చేసిన‌ట్లుగా క‌నిపించ‌దు. నిద్ర లేచింది మొద‌లు ప‌డుకునే వ‌ర‌కూ అంతా మైనార్టీ జ‌ప‌మే. అస‌ద్ నిజంగానే మైనార్టీల క్షేమం కోస‌మే కాంక్షించేదే నిజమే అయితే.. దేశం మొత్తం దాకా ఎందుకు ఆయ‌న పార్టీకి త‌ప్ప దేశంలోని మ‌రే పార్టీకి ఓటు వేయ‌ని పాత‌బ‌స్తీ ప్ర‌జ‌ల ఈతిబాధ‌లు.. వారి క‌ష్టాలు.. మౌలిక స‌దుపాయాలు.. అక్క‌డి పేద‌రికం ఎందుకు మార‌దు. ద‌శాబ్దాల త‌ర‌బ‌డి హైద‌రాబాద్ పాత‌బ‌స్తీలోని నియోజ‌క‌వ‌ర్గాల్లో వారి హ‌వానే న‌డుస్తుంటుంది. ఏ ఎన్నిక‌లు వ‌చ్చినా వారి సీట్ల వ‌ర‌కూ తీసేసే పార్టీలు లెక్క‌లు వేసుకుంటాయ‌న్న‌ది వాస్త‌వం.

మ‌రి.. త‌మ‌ను అంత‌గా ఆద‌రించే మైనార్టీ ప్ర‌జ‌ల‌కు ఓవైసీ ఏం చేశారన్న ప్ర‌శ్న‌కు.. పాత‌బ‌స్తీలో ఒక గంట తిరిగితే విష‌యం మొత్తం అర్థ‌మ‌వుతుంది. ఏ మైనార్టీల సంక్షేమం కోసం ఆయ‌న అంత‌లా ఊగిపోతుంటారో.. ఓవైసీ సోద‌రులు పాత‌బ‌స్తీ అభివృద్ధిని ఎంత‌గా కాంక్షిస్తారో పాత‌బ‌స్తీ ప్ర‌జ‌ల నోటి నుంచే తెలుసుకోవ‌చ్చు. న‌మ్మి ఓటేసిన ప్ర‌జ‌ల్ని దేవుళ్ల‌గా కొలుస్తూ.. వారికి సేవ చేయాల్సిన ఓవైసీ.. మందిరం.. మ‌సీదు అంటూ కోట్లాది మందిలో కాక పుట్టేలా మాట్లాడుతుంటారు.

మందిరం.. మ‌సీదు వ్య‌వ‌హారం కోర్టులో ఉంద‌న్న వాస్త‌వం తెలిసినా.. ఎప్ప‌టిక‌ప్పుడు కొంద‌రు రాజ‌కీయ నేత‌లు ఏదో ఒక‌టి మాట్లాడేసి హీట్ జ‌న‌రేట్ చేస్తుంటారు. తాజాగా అదే తీరులో మాట్లాడారు అస‌దుద్దీన్ ఓవైసీ. బాబ్రీ మ‌సీదును మ‌ర్చిపోవాల‌ని ముస్లింల‌ను బెదిరిస్తున్నార‌ని.. అలా బెదిరించే వారంద‌రికి తాను చెప్పేది ఒక్క‌టేనంటూ.. "అక్క‌డ మ‌సీదు ఉండేది. ఉంది. భ‌గ‌వంతుడి కృప‌తో భ‌విష్య‌త్ లోనూ ఉంటుంది. మేం మ‌సీదును మ‌రిచిపోయే ప్ర‌సక్తే లేదు. సుప్రీంకోర్టు మ‌త విశ్వాసాలను కాకుండా.. ఆధారాల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకొంటుంద‌ని భావిస్తున్నా" అని వ్యాఖ్యానించారు.

ఇక‌.. అస‌ద్ లాంటోళ్లకు కౌంట‌ర్ ఇచ్చేందుకు బీజేపీ నేత‌లు సిద్ధంగా ఉంటారు. తాజాగా బీజేపీ నేత.. కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్ మాట్లాడుతూ.. జిన్నా భూతం అస‌ద్ లాంటోళ్ల‌ను ప్ర‌భావితం చేస్తోంద‌న్నారు. వారు దేశాన్ని ముక్క‌లు చేయాల‌నే ధోర‌ణితో అలా మాట్లాడుతున్నార‌ని వ్యాఖ్యానించారు. దేశంలో బాబ‌ర్ వార‌సులు ఎవ‌రూ లేర‌ని.. ఇక్క‌డి ముస్లింలో ఎవ‌రూ విదేశీయులు కార‌ని..భార‌తీయ ముస్లింలంతా రాముని వార‌సులేన‌న్నారు. మ‌న పూజ‌ల్లో ఇప్పుడు తేడాలు ఉండొచ్చు కానీ మ‌న‌మంతా ఒక్క‌టే.. మ‌నంద‌రికి రాముడే ఆరాధ్య‌దైవ‌మ‌ని చెప్పేశాడు. మేం రాముడ్ని పూజించం.. మాకు అల్లానే ప్రాణం అనే వారి ముందు ఇలాంటి మాట‌లు చెబితే మంట‌పుట్ట‌కుండా ఉంటుందా?