Begin typing your search above and press return to search.

బడ్జెట్ పేరుతో మోడీపై సరికొత్త వార్

By:  Tupaki Desk   |   5 Jan 2017 10:02 AM GMT
బడ్జెట్ పేరుతో మోడీపై సరికొత్త వార్
X
మరో దుమారం మొదలైంది. పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన ప్రధాని మోడీ నిర్ణయాన్ని తీవ్రంగా నిరసిస్తూ విపక్షాలు చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదని చెప్పాలి. నోట్ల రద్దు నిర్ణయంతో ప్రజలు కష్టాలు పడినప్పటికీ.. దేశానికి ఏదో లాభం జరుగుతుందన్న భావన ప్రజల్లో ఉండటంతో.. కొన్ని కొన్ని చోట్ల కాస్తంత నిరసనలు పెల్లుబికినప్పటికీ.. దేశ వ్యాప్తంగా చూస్తే.. దేశ ప్రజలు ఈ నిర్ణయాన్ని స్వాగతించారనే చెప్పాలి. నోట్ల రద్దుతో మోడీ సర్కారుకు సినిమా చూపించాలని భావించినా ఆ ప్రయత్నాలు ఫలించలేదు.

ఇదిలా ఉంటే.. సంప్రదాయంగా ప్రవేశ పెట్టే బడ్జెట్ ను ఈసారి.. జనవరి చివరిలోనే ప్రవేశ పెట్టాలన్న నిర్ణయాన్ని మోడీ సర్కారు గతంలోనే వెల్లడించింది. అయితే.. ఇదే సమయంలో ఐదు రాష్ట్రాల్లో (ఉత్తరప్రదేశ్.. పంజాబ్.. గోవా.. ఉత్తరాఖండ్.. మణిపూర్) అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో.. ఎన్నికల వేడి ఒక్కసారిగా మొదలైంది.

మినీ భారత్ ఎన్నికలుగా అభివర్ణిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ.. బడ్జెట్ ప్రవేశ పెట్టటం ఎంతమాత్రం సరికాదన్న వాదనను విపక్షాలు తెర మీదకు తీసుకొచ్చాయి. మోడీని ప్రతి విషయంలో వ్యతిరేకించే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి.. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ - కాంగ్రెస్ - బీఎస్పీ - ఆర్జేడీ పార్టీలు వ్యతిరేక గళాన్ని వినిపిస్తున్నాయి.

తాజాగా ఈ పార్టీ ప్రతినిధులు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి.. ఎన్నికలకు ముందు బడ్జెట్ ను ప్రవేశ పెట్టటం సరికాదన్న వాదనను వినిపించారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బడ్జెట్ కార్యక్రమాన్ని వాయిదా వేయించాలని కోరారు. ఎన్నికల్ని నిష్పక్షపాతంగా జరిపించాలని కోరారు. ఇదిలా ఉంటే.. బడ్జెట్ అనేది రాజ్యాంగ ప్రక్రియలో భాగమని.. బడ్జెట్ ను పెట్టి తీరుతామని కేంద్రం చెబుతోంది. ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు.. ఓటర్ల దృష్టిని ఆకర్షించేందుకు వీలుగా బడ్జెట్ ప్రవేశ పెట్టాలని మోడీ సర్కారు భావిస్తోందన్న వాదనను విపక్షాలు వినిపిస్తున్నాయి. విపక్షాలు మొదలెట్టిన తాజా వార్ ను మోడీ ఏ విధంగా ఎదుర్కొంటున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/